ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో అధికారంలో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బలాబలాను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.  ఇదే విషయాన్నిరాష్ట్ర  మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన సహజ ధోరణిలో లీకులిచ్చినట్టుగా కన్పిస్తుంది.  డిసెంబర్‌లో మున్సిపల్‌ ఎన్నికలు వచ్చే అవకాశముందని మంత్రి బొత్స సూచనప్రాయంగా చెప్పడం గమనార్హం. గురువారం మున్పిపల్‌ కమిషనర్లతో అయన సమావేశాన్ని నిర్వహించారు.



వచ్చే ఉగాదికి ఇళ్ల పట్టాలివ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని చెప్పారు.  ఈ కార్యక్రమం కోసం వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయం అధికారుల సేవలను మున్సిపల్‌ అధికారులు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. చాలామంది కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయమని అడుగుతున్నారనీ, ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  విజయవాడలో మున్సిపల్‌ కమిషనర్‌ల వర్క్‌షాప్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన బొత్స మాట్లాడారు.




స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి డ్రైనేజీ వ్యవస్థ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణాల్లో నీటి కొరత రాకుండా చూడాల్సిన అవసరముందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒకేసారి నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు.  వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చాలా మంది అధికారులు ప్రజలు ఫోన్‌ చేస్తే ఫోన్‌ ఎత్తట్లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.  స్పందన కార్యక్రమం అమలు విషయంలో  అధికారులు రాజీ పడడానికి వీల్లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: