గత కొన్ని రోజులుగా తెలుగుదేశం, వైకాపాల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతున్నది. పల్నాడులో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన శిబిరాలలో బాధితులు తలదాచుకున్న సంగతి తెలిసిందే. బాధితులు రక్షణ కోసం ఛలో ఆత్మకూరు కార్యక్రమం ప్రకటించిన వెంటనే పల్నాడులో ఉద్రిక్తలు మొదలయ్యాయి. ఈ ఉద్రిక్తతలు ఎంతవరకు వెళ్ళాయో తెలిసిందే. ఇప్పుడు కడపజిల్లాలోని బెస్తవేముల గ్రామంలోని ఓ రైతు పంటను అధికారులు నాశనం చేయడంతో బాబు స్పందించారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. అటు జగ్గయ్యపేటలో బెదిరింపులపై కూడా బాబు స్పందించారు.
కడప జిల్లాలోని బేస్తవేముల గ్రామంలో నల్లబోతుల నాగయ్య అనే సామాన్య రైతు దాదాపు 12 ఏళ్ల నుంచి 5 ఎకరాలు జీవనాధారంగా సాగు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్ధతుగా నిలిచారని పంట పూర్తయ్యాక పొలం ఖాళీ చేస్తామని చెప్పినా కూడా పట్టించుకోకుండా వైసీపీ నాయకుల ప్రోద్బలంతో అధికారులను, పోలీస్లను అడ్డం పెట్టుకొని బోర్ను సీజ్ చేసినట్టు బాబు చెప్పారు. పండించుకుంటున్న పత్తి పంటను సర్వనాశనం చేసి రైతు నోటి కాడ పంటను లాగేయడం అమానుషం.
తెలుగుదేశం పార్టీ చలో ఆత్మకూరుకు పిలుపు ఇచ్చిన రోజే ఇలా దాడి జరగడం వైసీపీ ప్రభుత్వ ఫాసిస్టు చర్యలకు అద్దం పడుతోందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను టార్గెట్ చేస్తూ దాడులకు దిగడం అన్యాయం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 5,400 దానిమ్మ చెట్లను నరికివేసి భూములను లాక్కున్నారు. తూర్పు గోదావరిలో కొబ్బరి చెట్లను నరికేశారు. కడప జిల్లాలో చీనీ చెట్లను నాశనం చేశారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతులపై కక్షసాధింపు చర్యలకు దిగడం హేయమని బాబు పేర్కొన్నారు.
100 రోజులకే జగన్ పాలన 300 దాడులు 600 బెదిరింపులతో రాష్ట్రం రావణ కాష్టంలా మారింది. దళితులు, బడుగు బలహీన వర్గాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడటం అన్యాయమని అన్నారు. జగ్గయ్యపేటలో వడ్డేర వర్గీయులైన బత్తుల నరసమ్మ కుటుంబాన్ని వైసీపీ నాయకులు బెదిరింపులు గురిచేయడం దుర్మార్గం. రేషన్ కార్డులు, ప్లాట్లు తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వినతి పత్రాన్ని అందించారని బాబు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి కార్యకర్తలపై ప్రభుత్వం చేస్తున్న దాడులు, బెదిరింపులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. బాధితులకు న్యాయం జరిగేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు.