కర్రా విరగకూడదు...పాము చావు కూడదు అనే సామెతని... వల్లభనేని వంశీ...బాగా ఫాలో అవుతున్నట్లున్నారు. 2014లో గన్నవరం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయిన వంశీ...టీడీపీ అధికారంలో ఉండటంతో బాగానే యాక్టివ్ గా పని చేశారు. అయితే మొన్న ఎన్నికల్లో రెండో సారి స్వల్ప మెజారిటీతో గెలిచిన వంశీ...పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. దీంతో ఆయన పార్టీ మారిపోతారని ప్రచారం జరిగింది. కొందరు బీజేపీలోకి వెళతారని, మరికొందరు వైసీపీలోకి వెళతారని అనుకున్నారు.
కానీ అలాంటిదేమీ జరగలేదు. అలా అని టీడీపీలో ఉంటూనే... యాక్టివ్ గా ఉండట్లేదు. ఏదో ఆయన పని ఆయన చేసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, పెళ్లిళ్లు,పెరంటాల్లో పాల్గొంటున్నారు తప్ప..పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. అప్పుడప్పుడు వచ్చిన ఎక్కడో ఓ మూల ఉంటున్నారు. అటు అసెంబ్లీలో కూడా అదే పరిస్తితి. అయితే టీడీపీలో ఇలా ఉంటూనే..ఆయన వైసీపీ నేతలతో కూడా టచ్ లో ఉన్నారని ప్రచారం ఉంది.
పోనీ వైసీపీకి టచ్ లో ఉంటే అందులోకి వెళ్ళడం లేదు. మామూలుగా జగన్ పార్టీలో చేరే నేతలు పదవులకు రాజీనామా చేసే పార్టీలో చేరాలని రూల్ పెట్టిన విషయం తెలిసిందే. అందుకే వంశీ కొంచెం తటపటాయిస్తున్నట్లు కనిపిస్తోంది. అటు టీడీపీలో పూర్తిగా యాక్టివ్ గా ఉండక..వైసీపీలోనూ చేరక అలా ఉండిపోయారు. అయితే ఆయన పరిస్థితులు బట్టి వ్యూహాత్మకంగా నడిచే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే త్వరలోనే వైసీపీలో చేరిపోవచ్చు. లేదంటే ఇలాగే టీడీపీలో కొనసాగవచ్చు.
ఈలోపు నెక్స్ట్ ఎన్నికలు వస్తే అప్పుడు పార్టీల ఊపుని బట్టి నడిచే అవకాశం ఉంది. ఇక జిల్లా టీడీపీలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో వంశీకి పొసగదు. ఈ క్రమంలోనే జిల్లా పార్టీ వ్యవహారాలను కూడా ఆయన పట్టించుకోవడం మానేశారు. మొత్తానికైతే వంశీ కర్రా విరగకూడదు...పాము చావకూడదు అన్నా చందంగా నడుచుకుంటున్నారు.