భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం దాదాపు ఖరారైంది. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో మరో మూడు రోజుల్లో జరిగే ట్వంటీ -20 సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కలేదు. దీనికితోడు ప్రపంచకప్ తర్వాత నుంచి ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు మొదలయ్యాయి. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినా ధోని మాత్రం రెండు నెలలు సెలవు పెట్టి ఆర్మీలో సేవలందించాడు.
ఇక తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కకపోవడంతో ధోనీ రిటైర్మెంట్ దాదాపు ఖాయమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ధోని రిటైర్ అయ్యాక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీయే అని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందుకు తాజాగా చేసిన వ్యాఖ్యలు సైతం ఊతమిచ్చేలా ఉన్నాయి. ధోనీ ముందు నుంచి బిజెపి సానుభూతి పరుడిగా ఉన్నట్టు కనిపిస్తోంది.
తాజాగా, ధోనీ మాట్లాడుతూ.. జార్ఖండ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఎంత కష్టపడ్డమో తనకు తెలుసంటూ ఉద్వేగంగా మాట్లాడాడు. రాష్ట్రంపై ధోనీ మాట్లాడడంతో అతడు సొంత రాష్ట్రానికి సేవ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్టు అర్థమవుతోంది. త్వరలోనే ధోనీ సొంత రాష్ట్రమైన జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు సైతం ధోనీతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది.
జార్ఖండ్ బీజేపీలో ధోనీకి క్రియాశీలక బాధ్యతలు అప్పగించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం సైతం ఆసక్తితో ఉందట. మరి భారత క్రికెట్ జట్టు ఆటగాడిగా, కెప్టెన్గా విజయవంతమైన ధోనీ రేపు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక ఎలా రాణిస్తాడో ? చూడాలి.