టిఆర్ఎస్ నాయకత్వానికి ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి రంగం సిద్దమైందా ? అంటే అవుననే ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి . పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే తరువాయి ... శాసనసభ్యుడిగా అయన పై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని కలిసి టీఆర్ఎస్ ఎల్పీ ప్రతినిధి బృందం కోరనున్నట్లు తెలుస్తోంది . మరో నాలుగున్నరేళ్ల కాలం పాటు శాసనసభ్యుడిగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, పార్టీ ఫిరాయించాలని భావిస్తున్న షకీల్ ను ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోగానే అనర్హుడిగా ప్రకటించే విధంగా టిఆర్ఎస్ నాయకత్వం వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం .
షకీల్ పై అనర్హత వేటు వేయడం ద్వారా పార్టీ ఫిరాయించాలనుకునే ఎమ్మెల్యేలు, వెనుకంజ వేసే అవకాశాలు ఉంటాయని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి . కేబినెట్ విస్తరణ అనంతరం మంత్రి పదవి దక్కలేదని పలువురు శాసనసభ్యులు అసమ్మతి గళం వినిపించగా , ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే . అసంతృప్తి గళం వినిపించిన వారిని, అజ్ఞాతం లోకి వెళ్లిన వారిని పార్టీ నాయకత్వం బుజ్జగించి దారి తెచ్చుకుంటున్న తరుణంలో, నిజామాబాద్ ఎంపీ అరవింద్ తో షకీల్ భేటీ కావడం రాజకీయంగా కలకలాన్ని రేపింది . తాను పార్టీ లో కొనసాగే పరిస్థితి లేదని ఆత్మాభిమానం చంపుకుని టిఆర్ఎస్ లో కొనసాగలేనని షకీల్ చేసిన వ్యాఖ్యలు, ఆయన పార్టీ మారడం ఖాయమని తేటతెల్లం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో షకీల్ ను బుజ్జగించడం కంటే ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా పార్టీ మారాలనుకునే వారికి గట్టి హెచ్చరికలు పంపాలని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది .