రైతులకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశ్యంతో జగన్ సర్కారు వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీ నుంచి అమలు చేయబోతోంది. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ కొన్ని సూచనలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతు భరోసా సాయం అనర్హులకు అందకూడదని అధికారులకు తేల్చి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో మాదిరిగా వ్యవసాయం చేయని వారికి, విదేశాల్లో ఉంటూ సాగు చేయని భూ యజమానులకు, వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్, చేపల చెరువులుగా మార్పిడి చేసిన వారికి రైతు భరోసా కింద లబ్ధి కలగకూడదన్నారు.
వైఎయస్ఆర్ రైతు భరోసా’ పథకాన్ని నిజమైన రైతులందరికీ అందేలా చూడాలని సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు భరోసా పథకానికి అర్హులు ఎవరో తేల్చేలా ఈనెల 18 నుంచి 25 వరకు సర్వే చేయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని వెబ్లాండ్ జాబితాను గ్రామ పంచాయితీల వారీగా పరిశీలించి అందులో ఉన్న వారు నిజమైన రైతులో కాదో గుర్తించి ఈ పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందించాలన్నారు.
ఈ పథకం అమలుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆయన వ్యవసాయ మంత్రి కన్నబాబు, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, అనుబంధ రంగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైయస్ఆర్ రైతు భరోసాపై పక్కా ప్రణాళిక రూపకల్పన కోసం సీఎంతో సమీక్ష అనంతరం అధికారులు చర్చలు జరిపారు.
తండ్రి చనిపోయాక వ్యవసాయం చేస్తున్న పిల్లల పేర్లు, కొత్తగా భూమి కొనుగోలు చేసిన వారి పేర్లు, ఈనాం సాగుదార్లను రికార్డుల్లోకి ఎక్కించాలని నిర్ణయించారు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాలలో ప్రదర్శిస్తారు. రైతుల సందేహాల నివృత్తికి హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తానికి ప్రభుత్వ సాయం అర్హులకే అందాలన్న స్ఫూర్తి మంచిదే.