నెల్లూరు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఓ స్థల వివాదంలో చెలరేగిన గొడవ ఓ నిండు ప్రాణం బలైపోయేలా చేసింది.  జిల్లాలోని అనంతసాగరం మండలం మినగల్లు గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కసితో రగిలిపోతున్న ప్రత్యర్థుల దాడిలో టీడీపీ కార్యకర్త వెంకయ్య ప్రాణాలు కోల్పోయాడు.


మినగల్లు గ్రామానికి చెందిన వెంకయ్యకు అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తితో 3నెలల క్రితం స్థలం విషయంలో గొడవ జరిగింది. ఆ వివాదాన్ని మనసులో ఉంచుకున్న అతను ఎలాగైనా వెంకయ్యను చంపేయాలని ప్లాన్ వేశాడు. సరైన సమయం కోసం ఎదురు చూశాడు. ఈ రోజు ఉదయం పొలం వద్దకు వెళ్లి వస్తున్న వెంకయ్యను.. కాపు కాసిన ఆ వ్యక్తి.. ఐదుగురితో కలిసి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వెంకయ్య తీవ్రగాయాలపాలై రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు.   


అంతేకాదు వెంకయ్యను చంపే సమయంలో అడ్డు వచ్చిన భార్య, కొడుకుపై కూడా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకయ్య మృతదేహంతో పాటు.. గాయపడిన బాధితులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  హత్యకు గల కారణాలు, నిందితుల గురించి ఆరా తీస్తున్నారు.  ఈ ఘటనతో మినగల్లు గ్రామంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ కార్యకర్తలు మాత్రం ఇవి రాజకీయ కక్షలే అంటూ ఆరోపిస్తున్నారు. హత్యా నెపాన్ని వైసీపీ నాయకులపై తోసేస్తున్నారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మరోవైపు వెంకయ్యను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. లేకపోతే ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తోంది. పోలీసులు నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. ఎక్కడున్నా పట్టుకొని కటకటాల వెనక్కి నెడతామంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: