'రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం కార్యకర్తలు, టీడీపీకి ఓటేసినవారిపై జరుగుతున్న దాడులు, వారికి సంబంధించిన ఆస్తుల విధ్వంసాలు, ఇతరేతర దుర్ఘటనలను వెంటనే నిరోధించాలని, ఆత్మకూరు సహా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ బాధితులందరికీ న్యాయం చేయాలని కోరుతూ తెలుగుదేశం నాయకులు శుక్రవారం రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం అందించారు.' ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని తెలుగుదేశం చేపట్టే వరకు వైసీపీ బాధితుల విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం గానీ, పోలీస్‌ యంత్రాంగం కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందని మాజీ మంత్రివర్యులు, టీడీపీ శాసనసభాపక్షనేత కింజరాపు అచ్చెన్నాయుడు నిలదీశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులపై జరుగుతున్న దాడులు, చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరుని ఏకరువు పెట్టారు. సాధారణంగా వరదలు , తుఫాన్లు, ఇతర విపత్తులు సంభవించినప్పుడు బాధితుల సంరక్షణార్ధం పునారావాస శిబిరాలు ఏర్పాటు చేస్తుంటామన్న ఆయన, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలు,  ఆ పార్టీకి ఓట్లేసిన వారే లక్ష్యంగా జరుగుతున్న దాడులవల్ల సర్వం కోల్పోయిన వారికోసం దేశంలోనే తొలిసారి పునరావాస శిబిరం ఏర్పాటు చేయాల్సి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. 


వైసీపీ దహనకాండకు బలైన వారికోసం, టీడీపీ శిబిరం పెట్టాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందని, అంతకుముందు గ్రామస్థాయిలో, మరీముఖ్యంగా పల్నాడులో జరుగుతున్న దాడులు, ఇతర సంఘటనల గురించి పోలీసులకు, అధికారులకు ఎన్నిసార్లు తెలియచేసినా వారినుంచి స్పందన ఏ విధమైన స్పందన లేనందునే 'ఛలో ఆత్మకూరు' కి పిలుపివ్వడం జరిగిందని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు. వైసీపీ బాధితులకు న్యాయం చేయాలనే శిబిరం ఏర్పాటు చేశామన్న ఆయన, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత, ఆదుకోవాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అని ప్రశ్నించారు. 


పల్నాడు ప్రాంతంలో గత వంద రోజుల్లో వేలాది కుటుంబాలు రోడ్డునపడిన విషయం ఖాకీలకు తెలియదా అని అచ్చెన్నాయుడు నిలదీశారు. గొడవలు చేయడానికో, రెచ్చగొట్టడానికో తమ పార్టీ 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం  చేపట్టలేదన్న ఆయన, ప్రభుత్వం బాధితుల విషయంలో ముందే ఎందుకు స్పందించలేదన్నారు.   బాధితులను హడావుడిగా గ్రామాలకు తరలించిన పోలీసులు, వారికి సరైన భరోసా కల్పించలేక పోతున్నారని, గ్రామాల్లో వదిలేయడమే మాపని, అక్కడేం జరిగినా మాకుసంబంధం లేదని పోలీసులే చెబితే ఇక వైసీపీ బాధితులకు ఎక్కడ రక్షణ ఉంటుందని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 


ఈ నేపథ్యంలోనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేశామన్న ఆయన, పోలీస్‌బాస్‌ను కలవాలని తాము నిర్ణయం తీసుకున్నాకే, నెల్లూరు అనంతపురం జిల్లాల్లో టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులకు పాల్పడిందన్నారు. రాష్ట్ర పోలీస్‌ పెద్దగా డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ పోలీసులకు  సరైన విధంగా ఆదేశివ్వాలని, గ్రామస్థాయిలో టీడీపీ శ్రేణులపైనే గాక, ఇతరేతర వర్గాలపై ఎటువంటి దాడులు జరగకుండా తగిన రక్షణ కల్పించాలని అచ్చెన్నాయుడు సూచించారు. చట్టం ముందు అందరూ సమానులేననే విషయాన్ని గుర్తించి, పక్షపాతం లేకుండా, న్యాయబద్ధంగా పోలీసులు విధులు నిర్వర్తించేలా చూడాల్సిన బాధ్యత డీజీపీపైనే ఉందన్నారు. 


రాష్ట్రంలో జరుగుతున్న ఫ్యాక్షన్‌ పాలన గురంచి, నూతన ప్రభుత్వం వచ్చాక ఈ వందరోజుల్లో  రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని దాష్టీకాలను పుస్తకాలరూపంలో డీజీపీకి అందించినట్లు టీడీపీ సీనియర్‌ నేత తెలిపారు. మాపార్టీ అధినేత ఆదేశాలను గౌరవించి 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్న ఆయన, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వినతులు, విజ్ఞప్తులపై డీజీపీ స్పందించకున్నా, రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడులను నిలువరించకపోయినా, టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చించి బాధితులను ఆదుకునే విషయంలో భవిష్యత్‌లో అనుసరించాల్సిన కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టంచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: