వైకాపా వందరోజుల పాలనను ముగించుకుంది. వందరోజుల పాలనపై వివిధ పార్టీలు వివిధ రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వందరోజుల పాలనపై పెదవి విరిచిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ వంద రోజుల పాలనపై ఈరోజు స్పందించింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వందరోజుల పాలనపై మాట్లాడారు. వైకాపా గ్రామ వాలంటీర్లుగా ఆ పార్టీకి చెందిన వ్యక్తులనే నియమించుకుందని, బయట వ్యక్తులకు వాలంటీర్ పోస్టులు ఇవ్వలేదని అన్నారు.
వైసీపీ సంక్షేమ పథకాలు జనరంజకం. వైసీపీ 100రోజుల పాలన జన విరుద్ధం. 151 సీట్లతో సంపూర్ణ మెజార్టీ సాధించిన వైసీపీని సమీప భవిష్యత్లో విమర్శించే అవకాశం ఉండదని భావించాను. వైసీపీ 100రోజుల పాలన ప్రణాళిక లేకుండా సాగింది. వైసీపీ విధాన నిర్ణయాలు ఇబ్బడిముబ్బడిగా జరిగాయి. ప్రజలను ఆందోళనకు గురిచేసే నిర్ణయాలు తీసుకున్నారు. సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడం విఫలం చెందింది. ఇసుక విధానాన్ని ఇంతవరకు ప్రకటించకపోవడం చేతగానితనం. ఇసుక పాలసీని ప్రకటించకపోవడం పట్ల ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇసుక విధానం ప్రకటించకపోవడం వల్ల లక్షమంది నష్టపోయారు. ఇది పూడ్చుకోలేని నష్టం వచ్చిందని పవన్ పేర్కొన్నారు.
గ్రామ వాలంటీర్ల విషయంలో కూడా పవన్ మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల మాదిరిగానే గ్రామ వాలంటీర్లు నియమించారని.. భవిష్యత్తులో దీనివలన ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం ఉందని పవన్ పేర్కొన్నారు. ఇక రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని, పధకాలు అమలు చేయాలంటే రాష్ట్రానికి దాదాపు రూ. 50వేల కోట్ల రూపాయల నిధులు అవసరం అని, వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారని పవన్ ప్రశ్నించారు. కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో వరదలు వచ్చాయి. ఆ వరద నీటిని సక్రమంగా వినియోగించుకోలేక పోయింది. ఫలితంగా నీరు వృధాగా సముద్రంపాలైందని పవన్ మండిపడ్డారు.