రాయలు ఏలిన సీమ రాయల సీమ. ఆ కాలంలో సీమలో చదువు సంస్కారం, అతిధులను గౌరవించడం ఒక సంప్రదాయంగా ఉండేది. రాయల కాలంలో గొప్ప గొప్ప కవులు, కళాకారులు ఉండేవారు. అందరిని రాయలసీమ ఆదరించింది. సీమను ఏలిన రాయలు పేరుమీద 1954 వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్థాపన జరిగింది. ఈ విశ్వవిద్యాలయంలో ఎందరో చదువుకున్నారు. గొప్ప వ్యక్తులుగా ఎదిగారు. దేవాలయాలకు మారుపేరు విశ్వవిద్యాలయాలు.
కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎందరో పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాంటి విశ్వవిద్యాలయాల్లో రౌడీయిజం, గూండాయిజం పెరిగిపోతే ఆ విశ్వవిద్యాలయం దుస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. స్టూడెంట్ ను దారిలో పెట్టె బాధ్యతను ప్రొఫెసర్లు తీసుకోవాలి. యూనివర్శిటీలో చదివే విద్యార్థులే దేశానికీ ఉపయోగపడతారు. అందుకే యూనివర్శిటీలో చదివే సమయంలో విద్యార్థులు చాలా జాగ్రత్తలు తీసుకొని చదువుకుంటారు. మిగతా విషయాలపై పెద్దగా దృష్టిపెట్టకుండా చదివితే దేశం గర్వించే స్థాయికి ఎదుగుతారు అనడంలో సందేహం అవసరం లేదు.
అదే విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మధ్య గొడవలు, రాద్ధాంతాలు జరిగితే.. విద్యార్థుల పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అదే విద్యార్థులు కాకుండా, అధ్యాపకుల స్థాయిలో ఉన్న వ్యక్తులు రగడ చేస్తే..విశ్వవిద్యాలయం పరిస్థితులు ఎలా ఉంటాయో మరి. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలోని రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఇంచార్జ్ రిజిస్ట్రార్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు సాంకేతిక సర్వీసులని అందిస్తున్న కంపెనీ ప్రతినిధిని దూషించడం, మానసికంగా హింసించడం ఎంతవరకు కరెక్ట్.
అయన ఓ కంపెనీ ప్రతినిధి. పైగా వికలాంగుడు. అలాంటి వ్యక్తికి గౌరవం ఇవ్వాలి.. తెలియనప్పుడు తెలియదని చెప్పాలిగాని, దూషించడం ముమ్మాటికీ తప్పే. విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు తావుండకూడదు. అలాంటప్పుడే సదరు విశ్వవిద్యాలయాలు ఉన్నతిని సాధిస్తాయి. ఒక్కసారి రాజకీయాలు విశ్వవిద్యాలయంలోకి ఎంటరైతే.. విద్య పక్కదారి పడుతుంది. విద్యార్థులు రాజకీయాలకు సమిధులౌవ్వాల్సి వస్తుంది. గొప్ప విశ్వవిద్యాలయంగా చరిత్ర కెక్కిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఇలాంటి దుస్థితి నెలకొనడం బాధాకరమైన విషయం.