ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం అకస్మాత్తుగా చర్చకు వచ్చింది. అది కూడా ఏదో ఘనత సాధించి ఈ విశ్వవిద్యాలయం వార్తల్లోకి వస్తే.. పరిస్థితి వేరేగా ఉండేది. కానీ, ఇక్కడి ఇంచార్జ్ రిజిస్ట్రార్గా ఉన్న ఉన్నతాధికారి.. తన వ్యవహారంతో ఈ యూనివర్సిటీని వార్తల్లో నిలిచేలా చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఇంచార్జ్ రిజిస్ట్రార్ అయినప్పటికీ.. ఆయన పాలనపై పూర్తి అధికారాలు ఉంటాయి. అయితే, ఈ వ్యవహారాలను నిబంధనల మేరకు నిర్వహించాలనేది ప్రజాస్వామ్య వాదులు సహా విద్యార్థి సంఘాల వాదన.
కానీ, ప్రస్తుతం వెల్లువెత్తుతున్న విమర్శలను పరిశీలిస్తే.. ఆ ఇంచార్జ్ రిజిస్ట్రార్ మాత్రం రాజకీయ అజెండాలను మోస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. గత ప్రభుత్వ హయాంలో నియామకం పొందిన ఆయన ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు విమర్శకులు. ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన కొన్ని సాంకేతిక పనులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఓ సంస్థకు అప్పగించారు. అయితే, ఇది ఒక పార్టీ సానుభూతి పరుడుకి చెందినదిగా చెబుతున్నారు. అయితే, గత ప్రభుత్వ అజెండాను అమలు చేయాలని భావించిన ఇంచార్జ్ రిజిస్ట్రార్ గతంలోనూ ఈ సంస్థకు సహకరించలేదనే విమర్శలు ఉన్నాయి.
అయితే, అప్పటి ప్రభుత్వం టీడీపీది కాబట్టి ఆ ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకున్నారని అనుకున్నా.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అయినా కూడా ఈయన మాత్రం తన అజెండాను మార్చుకోలేదని తాజా పరిణామం రుజువు చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
సాంకేతిక పనులకు సంబంధించి కొర్రీలు వేస్తూ.. ఏదో ఆశిస్తున్నారనే ప్రచారం ఇంచార్జ్ రిజిస్ట్రార్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు దూరంగా ఉంటూ.. అవినీతిని ఎట్టి పరిస్థితిలోనూ ప్రోత్సహించేది లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇంచార్జ్ రిజిస్ట్రార్ సాంకేతిక పనులు చేస్తున్న సంస్థ ప్రతినిధి దివ్యాంగుడని కూడా చూడకుండా వేధించారని పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఆయన సొంత అజెండాలకు విశ్వవిద్యాలయాన్ని వేదిక చేస్తున్నారని, దీనివల్ల ఎస్వీ పరువు పోతోందని ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ పాలన మారిందనే విషయాన్ని అక్రమాలకు, అన్యాయాలకు తావు లేదనే నిజాన్ని ఆయన గమనించాలని వారు సూచిస్తున్నారు. ఇప్పటికైనా పారదర్శకంగా ఉంటూ.. విద్యార్థులకు సమున్నత విద్య అందేలా చర్యలు తీసుకోవాలని వారు చేస్తున్న డిమాండ్ను రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు. మరి ఇంచార్జ్ రిజిస్ట్రార్ ఏం చేస్తారో చూడాలి.