బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల బలంతో కంటే ఫిరాయింపు రాజకీయాలతో ఎదగాలని.. అలాగైతేనే ఇక్కడ బలపడతాం అని డెసిషన్ తీసుకున్నట్టే కనపడుతోంది. ఇతర పార్టీలకు చెందిన నేతలను నయానా.. భయానో తమ పార్టీలో చేర్చుకోవడం బీజేపీకి కామన్ అయిపోయింది. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజులకే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను చేర్చేసుకుంది.
ఇక ఇదిలా ఉంటే అటు తెలంగాణలోనూ కాంగ్రెస్, టీడీపీకి చెందిన నేతలను కూడా కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అసంతృప్త నేతలపై కూడా వల వేస్తోంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు చెందిన నేతలపై కూడా వల వేస్తోన్న బీజేపీ ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలపై వల వేసినట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ ఇద్దరు ఎంపీలకు జాతీయ స్థాయిలో కాంట్రాక్టులు ఉన్నాయి. కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తోన్న వీరికి అటు వైపు నుంచి ప్రెజర్ చూపించి పార్టీలోకి లాగేసుకోవాలని కమల దళం ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం వైసీపీ నాయకత్వానికి తెలియడంతో ఆ పార్టీ అధిష్టానం వెంటనే వాళ్లను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ ప్రచారం బయటకు రావడంతో బీజేపీ ట్రాప్ చేసిన ఆ ఇద్దరు వైసీపీ ఎంపీలు ఎవరా ? అన్నది పలువురు ఆరాలు పేరాలు తీస్తున్నారు. వైసీపీకి చెందిన ఎంపీల్లో ముగ్గురు, నలుగురు జాతీయ స్థాయిలో కాంట్రాక్టులు చేస్తోంది నిజం. వీళ్లలో కోస్తా దిగువన ఉన్న జిల్లాలతో పాటు సీమకు చెందిన ఎంపీలే ఉన్నారు. ఇక బీజేపీకి రాజ్యసభలో బలం లేదు... అందుకే బిల్లలు పాస్ కోసం ఇతర పార్టీలపై ఆధారపడుతోంది. అటు లోక్సభలో బలం ఉన్నా మరింత బలం కోసం ఇతర పార్టీల ఎంపీలను రకరకాల ప్రేరణలతో లాగేసుకుంటోంది.