పవన్ కల్యాణ్ నిలకడలేని, అవగాహన లేని వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై మాట్లాడటం అనవసరమని అయన కొట్టిపారేశారు. ఆదివారం  త్రిమూర్తులు సైకిల్ దిగి ఫంక చేతపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్‌ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ క్రమంలో అయన వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకులు పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి కోసమే తాను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరానని తెలిపారు.



ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమర్థవంతమైన నేతను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీ అభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని, ఆ నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. పార్టీలోని సీనియర్లతో కలిసి జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కాపుల తరుపున మాట్లాడలేదని, ఆయన అభిప్రాయం మాత్రమే అని అన్నారు. ఈ  సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. తోట త్రిమూర్తులు  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ‘అన్ని సామాజిక వర్గాలకు సీఎం వైయస్‌ జగన్‌ న్యాయం చేస్తున్నారు, కాబట్టే అన్ని వర్గాల నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. ఎల్లో మీడియాకు తప్ప అన్ని వర్గాల ప్రజలకు జగన్‌ పాలన ఎంతో బాగా నచ్చిందన్నారు.




వంద రోజుల్లో  సీఎం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. అన్ని వ్యవస్థలను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆటోపించారు. . ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. త్రిమూర్తులు పార్టీలో చేరడం సంతోషంగా ఉందనన్నారు.  ఆయనతో కలిసి జిల్లా అభివృద్ధి కోసం పని చేస్తామన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆమంచి క్రిష్ణమోహన్ ఆక్షేపించారు. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. కాపులే కాదు అన్ని సామాజిక వర్గాలు వైస్సార్‌సీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సామాజిక న్యాయం జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యం.





సిగ్గులేకుండా చంద్రబాబు తన పార్టీ వాళ్ళను బీజేపీలోకి పంపుతున్నారు. చంద్రబాబు వెనుక ఉన్న వాళ్లు ఉత్తుత్తి నాయకులేనని విమర్శించారు.  తాము దేనికి ఆశపడి పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. టీడీపీ అనేది అక్రమ వ్యాపార సంస్థ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అనంతరం.. టీడీపీని నమ్ముకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ‘చంద్రబాబుకో దండం’ అంటూ గుడ్‌బై చెప్పేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తోట త్రిమూర్తులు, తన అనుచరులతో కలిసి టీడీపీకి రాజీనామా చేయడం, వైఎస్సార్‌సీపీలో చేరడం జిల్లాలో టీడీపీని ఓ కుదుపు కుదిపింది. చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి కారణంగా టీడీపీకి నానాటికీ ప్రజాదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఆ పార్టీకి ఒక్కొక్కరుగా నాయకులు గుడ్‌బై చెప్పేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: