తెలంగాణాలో కెసిఆర్ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మరో మూడు పర్యాయాలు అధికారంలోకి వస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. మరో పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా స్పష్టం చేశారు. కెసిఆర్ ఇంతధీమాతో చెప్పడంతో వెనుక చాలా కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో తెరాస పార్టీ బలంగా మారడంతో పాటు తెలుగుదేశం పార్టీ బలహీనపడటం.. కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడు లేకపోవడం వంటివి ప్రధాన కారణాలు.
ఈ రెండు కారణాలతో పాటు బీజేపీ ఎదుగుదల పెద్దగా లేకపోవడంతో కెసిఆర్ ఆ విధంగా నిన్నటి రోజున మాట్లాడారు. ఈ మాటలను పక్కన పెడితే.. ప్రతి పార్టీలో ఒక్కొక్క సామాజికి వర్గానికి చెందిన వ్యక్తులు తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నది. తెరాస పార్టీలో వెలమ సామాజిక వర్గం బలంగా ఉన్నది. అలానే తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ సమయంలో బీజేపీ రాష్ట్రంలో ఎదగాలంటే ఒక సామజిక వర్గానికి చెందిన వ్యక్తుల అండ ఉండాల్సిన అవసరం ఉన్నది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు ఉన్నప్పటికీ పార్టీ బలం పడటం లేదు. వచ్చే ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నది. బీజేపీ లో చాలామంది కార్యకర్తలు చేరారు. అందులో చాలా వరకు యువత ఉన్నది. చాలామంది అందులో యాక్టివ్ గా ఉండటం లేదు.
ఎన్నికల సమయంలో మాత్రమే ఓటు వేసేందుకు బయటకు వస్తారు. అలా కాకూండా, పార్టీలో సభ్యత్వం తీసుకున్న వ్యక్తులతో నిత్యం టచ్ లో ఉంటూ.. వారిని ప్రోత్సహిస్తూ ఉంటె.. వారంతా యాక్టివ్ అవుతారు. యాక్టివ్ అయితే, పార్టీ కోసం తప్పకుండా పోరాటం చేస్తారు. అలా చేయడం వలన కొంతవరకు పార్టీ బలపడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పార్టీలోకి మచ్చలేని నాయకుల అవసరం కూడా ఉన్నది. మొన్నటి వరకు మహారాష్ట్రకు గవర్నర్ గా చేసిన విద్యాసాగర్ రావు.. ఇపుడు తిరిగి బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారు. దీంతో ఆయన్ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి.