తూర్పు గోదావరి జిల్లా పాపికొండ టూర్ సందర్భంగా గోదావరి నదిలో మునిగిన లాంచీ జాడ దొరికిందట.. దాదాపుగా 315 అడుగుల లోతులో ఈ లాంచీ మునిగిపోయిందని ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలు తెలిపాయట. పాపికొండలకు విహారయాత్రకు వెళుతున్న లాంచీ మునిగి విషాద సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వెళుతున్న రాయల్ వశిష్ఠ ప్రైవేటు బోటు గోదావరిలో మునిగిపోయింది. లాంచీ మునిగిన సమయంలో కొందరు తూటుగుంట గ్రామస్థులు పడవల్లో వెళ్లి లైఫ్ జాకెట్లు వెసుకున్నవారిని ఒడ్డుకు తీసుకువచ్చారు.
అయితే సోమవారం ఉదయం నుంచి ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలు లాంచీ కోసం జల్లెడ పడుతున్నారు. అయితే ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలు 315 అడుగుల లోతులో లాంచీ మునిగినట్లు గుర్తించారు. బోటు నుంచి అయిల్ లీక్ అవుతున్న ఆధారాలను బట్టి బోటును గుర్తించారు. బోటు మునిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కువ లోతు, ప్రవాహం ఉధృతంగా ఉండడంతో లాంచీ వెలికి తీసేందుకు ఎక్కువ సమయం పడుతుందని ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందం తెలుపుతున్నాయి. గల్లంతైన వారిలో ఎక్కువ మంది లాంచీలో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు.
పాపికొండ టూర్ లో 60 మంది ప్రయాణిస్తున్న బోటు ముంపు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 12 మృతదేహాలు వెలికితీశారు.ఎన్ డీ ఆర్ ఎఫ్, నేవీ సిబ్బంది 27 మందిని సురక్షితంగా ప్రాణాలతో కాపాడారు. అదృశ్యమైన మరో 25 మంది కోసం రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 6 అగ్నిమాపక బృందాలు, 08 ఐఆర్ బోట్లు, 12 అస్కా లైట్లు, శాటిలైట్ ఫోన్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
8 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. ఏపీ సీఎం జగన్ ప్రమాద స్థలాన్ని ఏరియల్ సర్వే చేశారు. తరువాత మృతులకు పోస్టుమార్టం జరిగే ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. సీఎం జగన్తో పాటు హోంమంత్రి సుచరిత, ఇతర తెలంగాణ, ఏపీ మంత్రులు, అధికారులు సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.