ఎవరెన్ని చెప్పినా... ఎవరు ఔనాన్నా.. కాదన్నా కోడెల శివప్రసాద్రావు తీవ్రమైన అవమానాలతో బలవంతంగా ఉసురు తీసుకోవడానికి ఆయన పుత్రుడు కోడెల శివరాంతో పాటు ఆయన పుత్రికారత్నం పూనాటి విజయలక్ష్మే కారణం. ఐదేళ్ల పాటు తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని వీరిద్దరు నరసారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో చేసిన దందాలు, అరాచకాలు అన్ని ఇన్నీ కావు. ఈ అరాచకాలతో చివరకు టీడీపీకి చెందిన నాయకులు, నేతలే బయపడి దండం పెట్టేయాల్సిన పరిస్థితి.
చివరకు వీరిద్దరు దోపిడీలో ఒకరిని మించి మరొకరు పోటీపడ్డారు. ఏదైనా పని విషయంలో కోడెల దగ్గరకు వెళితే ముందుగా కుమారుడు శివరాం కమీషన్ తీసుకుంటే... ఆ తర్వాత కుమార్తె ఆ పనికి అడ్డంపడి తనకు కమీషన్ ఇవ్వనిదే ఆ పని చేయనివ్వని వాళ్లను బెదిరించే స్థితికి వచ్చేసింది. చివరకు పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన కోడెల కుమారుడికి వార్నింగ్ కూడా ఇచ్చారని టాక్.
సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో గెలిచి ఏపీ శాసనసభ స్పీకర్ గా ఎన్నికయిన తర్వాత కోడెల శివప్రసాదరావు నియోజకవర్గ బాధ్యతలను తనయుడు కోడెల శివరామ్ కు అప్పగించారు. అటు నరసారావుపేటోలనూ కోడెల తనయుడి హవానే ఉండేది. శివరామ్ చర్యలతో పార్టీతో పాటు కోడెలకు కూడా చెడ్డపేరు వచ్చింది. ప్రతి పనికీ కమీషన్లు దండుకోవడంతో కోడెల దశాబ్దాలుగా సంపాదించుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయింది.
కేఎస్పీ ట్యాక్స్ పేరుతో శివరాం చేసిన దందాలకు పేరు పెట్టేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో గత ఐదేళ్లలో కేఎస్పీ ట్యాక్స్ బాగా పాపులర్ అయ్యింది. ఇక తండ్రి వార్నింగ్తో శివరాం.. ఒకడు చచ్చిపోయాడు... నేను కూడా ఆత్మహత్య చేసుకుని చావనా.. అని బెదిరించేవాడని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా అప్పట్లో ప్రచారం బయటకు వచ్చింది. చివరకు కుమారుడి బెదిరింపులతో ఆయన మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఆయనే ఆత్మహత్యతో లోకాన్ని వీడి వెళ్లారు.