కంచుకోటగా టీడీపీ గొప్పగా చెప్పుకునే విశాఖ జిల్లాను ఒడిసిపట్టాలని వైసీపీ ఎత్తులు వేస్తోంది. లోకల్ వార్ కూడా వన్ సైడ్ చేయాలనుకుంటోంది. అందుకోసం భారీ గానే స్కెచ్ వేసినట్లుగా చెబుతున్నారు.  విశాఖ జిల్లాలో రాజకీయాలను ఏకపక్షం చేయలని వైసీపీ నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది. తాజా ఎన్నికల్లో జిల్లా మొత్తం అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీటుతో సహా గెలుచుకున్న వైసీపీ స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలనుకుంటోంది.


 ఈ నేపధ్యంలో టీడీపీలో బలమైన నాయకులకు గేలం వేస్తోంది. ఇప్పటికైతే  విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్, కుమార్తె మాజీ చైర్ పర్సన్  పిళ్లా రమణికుమారి తో పాటు పెద్ద ఎత్తున మండల నాయకులు చేరిపోయారు. ఇపుడు మాజీ మంత్రి, సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తమ్ముడు సన్యాసిపాత్రుడుని వైసీపీలో తీసుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు పార్టీ నాయకులకు సంకేతాలు వెళ్లాయని అంటున్నారు.


వైసీపీలో  కొత్తవారి చేరికల వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ జాగ్రత్తపడుతోంది. వైసీపీకి చెందిన నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కి ఈ విషయమై ఫోన్ చేసి సమాచారం హై కమాండ్ అందించినట్లుగా తెలుస్తోంది. ఆయన ద్వారానే సన్యాసిపాత్రుడిని ఆహ్వానించాలనుకుంటున్నారుట. ఈ మేరకు పార్టీ నాయకులతో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మీటింగ్ పెట్టి పార్టీలోకి ఎవరు వచ్చినా తీసుకోవాలని, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలుగా భావించాలని కోరారు.


అందరం కలసి నర్శీపట్నంలో పార్టీని అభివ్రుధ్ధి చేయాలని కూడా ఆయన కోరారు. ఇక తొందరలోనే సన్యాసిపాత్రుడు ముఖ్యమంత్రి జగన్ సమక్షలో  వైసీపీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. నర్శీపట్నంలో మునిసిపాలిటీలో ఎక్కువగా టీడీపీకి బలం ఉంది. మండలాల్లో వైసీపీకి ఆదరణ ఉంది. సన్యాసిపాత్రుడు చేరికతో మున్సిపాల్టీని గెలుచుకునే వ్యూహాన్ని వైసీపీ అనుసరిస్తుందని అర్ధమవుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: