ఒకవైపు వాహన చట్టం అమలుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనం బయటకు తీయాలి అంటే భయపడుతున్నారు. వాహన చట్టం ప్రకారం జరిమానా కట్టాల్సి వస్తుంది. ఒక్కసారి పట్టుకుంటే.. నెలజీతం పోయినట్టే. ప్రజల వ్యతిరేకత వస్తున్నా.. కొన్ని చోట్ల మాత్రం జరిమానాలు తప్పడం లేదు. ఇంకోవైపు పెట్రోల్ రేటు గుండెపోటు తెప్పిస్తోంది. పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీని నుంచి బయటపడేందుకు పాపం అనేక ప్రయాత్నాలు చేస్తున్నారు.
కానీ వీలు కావడం లేదు. దీంతో పాటుగా కరెంటు బిల్లులు కూడా కాటేస్తున్నాయి. చాలా చోట్లా సాంకేతిక లోపాల కారణంగా కరెంట్ బిల్లులు తాట రేపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ లో ఓ సాధారణ స్కూల్ కు ఏకంగా ఆరు కోట్ల రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆ స్కూల్ యాజమాన్యం లబోదిబో అన్నది. సాక్షాత్తు మోడీ నియోజక వర్గంలో ఇలాంటి పరిస్థితి రావడం విశేషం. ఇప్పుడు తెలంగాణాలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
గోదావరిఖనిలో ఈ పరిస్థితులు ఎదురయ్యాయి. గోదావరి ఖనిలో సంజయ్య నగర్ లో ఉండే రాజయ్య అనే వ్యక్తి ఇంటికి చెందిన పాత మీటర్ హెలికాఫ్టర్ చక్రం తిరిగినట్టుగా ఫాస్ట్ గా తిరగడం మొదలుపెట్టింది. దానిపై గతంలో రాజయ్య విధ్యుత్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చాడట. కానీ, దాని గురించి ఎవరూ పట్టించుకోలేదని అంటున్నాడు. తీరా ఇప్పుడు రెండు నెలకే కరెంట్ బిల్లు ఇచ్చి వెళ్లారు. ఆ కరెంట్ బిల్లు చూసి పాపం రాజయ్య షాక్ తిన్నాడు.
ఆగష్టు, సెప్టెంబర్ రెండు నెలలకుగాను ఏకంగా రూ. 6,07,414 /- వచ్చింది. అదేం బిల్లు అని ఆశ్చర్యపోయిన రాజయ్య పరుగుపరుగున విధ్యుత్ ఆఫీస్ వెళ్లి బిల్లు చూపించి గోడు చెప్పాడు. పాత మీటర్ స్పీడ్ గా తిరుగుతోందని, సరిచేయాలని గతంలో కంప్లైంట్ ఇచ్చానని కానీ ఎవరూ పట్టించుకోలేదని కంప్లైంట్ చేశారు. విద్యుత్ అధికారులు మాత్రం తమకు ఎలాంటి కంప్లైంట్ అందలేదని చెప్పడం విశేషం.