మహారాష్ట్రలో ఎన్నికల పొత్తులపై శివసేన, బీజేపీల నడుమ లుకలుకలు షురు అయ్యాయా.. కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తులు కుదరకముందే పొత్తులపై చర్చోపచర్చలు సాగించిన బీజేపీ, శివసేనకు ఇప్పడు సీట్ల సర్ధుబాటు వ్యవహారం పొత్తులు విచ్చుకునే సూచనలు గోచరిస్తున్నాయి. పొత్తులు కుదరకపోతే మా దారి మేము చూసుకుంటామంటూ శివసేన బీజేపికి అల్టిమేటమ్ ఇచ్చిందట. పొత్తులపై బీజేపీ నాన్చుడు ధోరణితో విసిగి వేసారిన శివసేన ఇక తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారట. దీనికి బీజేపీ వ్యవహార శైలీ నచ్చకపోవడమేనట..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. ఈనెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సన్నహాలు చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ ముంచుకు రాబోతున్న తరుణంలో మహారాష్ట్ర లో పార్టీల మధ్య పొత్తులు పొడుస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు అనేక పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం శివసేనతో పొత్తు పెట్టుకుని అధికారం నిలబెట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. అయితే బీజేపీ శివసేనతో పొత్తులకు సిద్ధమవుతూ సీట్ల పంపకంలో మాత్రం మెలిక పెడుతుందట.
ఎక్కువ స్థానాల్లో బీజేపీ పోటీ చేసి తక్కువ స్థానాలకే శివసేనను పరిమితం చేయాలని బీజేపీ ఎత్తులు వేస్తుంటే.. వాటిని తిప్పి కొట్టి బీజేపీ, శివసేనలు చెరి సగం స్థానాల్లో పోటీ చేయాలనే డిమాండ్ చేస్తుందట. దీనికి బీజేపీ ససేమిరా అంటుందట. పార్లమెంట్ ఎన్నికల సమయంలో హడావుడిగా శివసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తుల సమయంలోనే మహారాష్ట్ర ఎన్నికల్లో చేరో సగం సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకుందట. దానికి ఇప్పుడు బీజేపీ ససేమిరా అంటుందట. ఓవైపు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేతో చర్చలు జరుపుతూనే ఉన్నప్పటికి ఇవి ఒక కొలిక్కి రావడం లేదని సమాచారం.
అయితే శివసేన డిమాండ్ ప్రకారం, గత ఒప్పందాల ప్రకారం సీట్ల పంపకం జరుగకపోతే శివసేన తమ దారి తాము చూసుకుంటామని బీజేపీని హెచ్చరిస్తుంది. శివసేన రెండు ప్లాన్లతో ముందుకు పోతుందట. ఒకటి బీజేపీ సగం సీట్లు ఇస్తే కలిసి పోటీ చేయడం, ఇవ్వకుంటే.. ప్లాన్ బి అమలు చేస్తుందట. అంటే శివసేన ఒంటరిగానే 288స్థానాల్లో పోటీ చేస్తుందట. సో బలమైన శివసేనకు సగం సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకుంటుందో.. లేక పొమ్మనలేక పొగబెడుతుందో బీజేపీ చేతిలోనే ఉందనే టాక్ ఉంది. పొత్తుల్లో భాగంగా సీట్ల సర్ధుబాటు ఈనెల 19న అమిత్ షా సమక్షంలో తేలిపోనున్నదట.