అవును! ప్రమాదం ఒక్కటే.. కానీ, పాలకులు వాటిని చూసే కోణంలోనే చాలా తేడా కనిపించింది. తూర్పుగో దావరి జిల్లాలోని పాపికొండల సమీపంలో గోదావరి నదిలో బోటు బోల్తా ఘటన వ్యవహారానికి సంబందించి సోషల్ మీడియా సహా వెబ్సైట్లలో కూడా ఇదే తరహా చర్చ కొనసాగుతోంది. గతంలోనూ చంద్రబాబు హయాంలో కృష్ణానది సహా గోదావరి లో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాటలో ప్రమాదం జరిగిన పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా బోటు ప్రమాదాలు జరిగి అలానే ప్రాణనష్టం సంభవించింది.
ఇక, గత కార్తీక మాసంలో కృష్ణానదీ విహారానికి వెళ్లిన నెల్లూరు వాసులు నీట మునిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరోసారి గోదావరి వరదలో బోటు మునిగి పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు (వీరు అందరు చనిపోయారని ధ్రువీకరించలేదు). ఈ నేపథ్యంలో ఆయా సంఘటనలు జరిగినప్పుడు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం స్పందించిన తీరుకు, ఇప్పుడు రాష్ట్రంలో కొలువుదీరిన జగన్ ప్రభుత్వం నడుస్తున్న సమయంలో జరిగిన ప్రమాదానికి సంబందించి ఈ ఇద్దరు నాయకులు స్పందించిన తీరులో చాలా వ్యత్యాసం కనిపించిందని అంటున్నారు పరిశీలకులు.
గత పాలకుడు చంద్రబాబు విషయాన్ని తీసుకుంటే. ఏ ప్రమాదం జరిగినా.. వెంటనే రంగంలోకి దిగేవారు. పరిహారం అందించేందుకు ప్రకటనలు కూడా చేసేవారు. తన పార్టీ శ్రేణులను కూడా సహాయక చర్యల్లో పాల్గొనేలా ప్రోత్సహించేవారు. అయితే, జరిగిన ప్రమాదం తాలూకు బాధ్యతను మాత్రం తాను కానీ, ప్రభుత్వం కానీ తీసుకోకుండా పక్క వారిపై నెట్టేసేవారు. మన ప్రభుత్వం తప్పు చేసింది. ఈ ప్రమాదానికి మనమే బాధ్యులం- అని ఏనాడూ చంద్రబాబు చెప్పింది లేదు. పుష్కరాల ప్రమాదంలో భక్తులు మృతి చెందడానికి మీడియా కారణమని తేల్చారు. కృష్ణా బోటుకు వరద ప్రవాహమే కారణమన్నారు. గోదావరి ప్రమాదానికి ప్రజలు భారీ సంఖ్యలో ఎక్కారని , అందుకే మునిగిపోయారని వ్యాఖ్యానించారు.
కానీ, దీనికి భిన్నంగా .. జగన్ ఇప్పుడు జరిగిన గోదావరి బోటు ప్రమాదాన్ని తన తలమీదే వేసుకున్నారు. ‘వరద ఉధృతి వల్ల ప్రభుత్వ టూరిజం బోట్లు ఆగాయి. కానీ, ప్రైవేట్ బోట్లు ఎందుకు ఆగలేదు. పోలీసులు, అధికారులు ఎందుకు అడ్డుకోలేదు?’ అని ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆయన బోటు ప్రమాదంపై మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ప్రైవేట్ బోట్లను ఎందుకు ఆపలేదని ఆయన జగన్ నిలదీశారు.
‘ఇంతమంది ప్రాణాలు పోయాయంటే కారణం ఎవరు? మన అలసత్వం కారణంగానే ఇది జరిగింది. బాధితులను చూసినప్పుడు గుండె చెరువైంది. కుటుంబాలకు కుటుంబాలే కోల్పోయారు. మనమంతా ఏం చేస్తున్నాం అనిపిస్తోంది. ఆపగలిగే పరిస్థితిలో ఉన్నా బోటును ఆపలేకపోయాం` అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు జగన్కు చంద్రబాబుకు ఉన్న తేడా! అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధ్యతా యుతమైన నాయకుడు ప్రచారం కన్నా ఓదార్పుకే విలువ ఎక్కువ ఇస్తారని, ఇలాంటి తత్వం జగన్కే ఉందని చెబుతున్నారు. నిజమే కదా!!