వివాదాలకు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఎంతటి సుపరిచితుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఆయన అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. తాజాగా మళ్లీ భోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. మతం పేరుతో ఇలాంటి కార్యకలాపాలకు ఒడిగట్టే వారిని దేవుడు కూడా క్షమించడని అన్నారు. లైంగికదాడులు ఆలయాల లోపలే జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. సనాతన్ ధర్మాన్ని కాషాయ దుస్తులు ధరించిన కొంతమంది వ్యక్తులు నాశనం చేస్తున్నారు. ఇది మన మతమేనా..? అని దిగ్విజయ్ ప్రశ్నించారు.
కాగా, గతంలోనూ దిగ్విజయ్ ఇదే తరహాలో....వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆయన చేసిన అసభ్యకర ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఈ ట్వీట్లో... ప్రధాని మోదీ తాను రెండు ఘనతలు సాధించానని చెప్పుకున్నట్లుగా ఉండే ఫొటో ఉంటుంది. అందులో ఒకటి భక్తులను పిచ్చోళ్లను చేశాను.. రెండోది పిచ్చోళ్లను భక్తులను చేశాను అన్న వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది తనది కాకపోయినా.. పోస్ట్ చేయకుండా మాత్రం ఉండలేకపోతున్నానని ఆయన అన్నారు. ఇందులోని వ్యక్తికి క్షమాపణలు. ప్రజలను పిచ్చోళ్లను చేయడంలో ఈయన దిట్ట అని కూడా దిగ్విజయ్ మరో కామెంట్ చేశారు.
మరోవైపు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో పుణె పోలీసులు డిగ్గీ రాజాను ప్రశ్నించారు. మావోయిస్టుల దగ్గర బయటపడిన లేఖలో దొరికిన ఫోన్ నంబర్ దిగ్విజయ్దేనని పోలీసులు నిర్ధారించారు. దిగ్విజయ్ను స్నేహితుడిగా చెబుతూ ఆయన ఫోన్ నంబర్ను ఆ లేఖలో మావోయిస్టులు రాయడం విశేషం. పుణె డీసీపీ సుహాస్ భావ్చె కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. విద్యార్థుల ద్వారా దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించడంలో తమకు సహకరించడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నట్లు కమాండర్ సురేంద్రకు రాసిన లేఖలో కమాండర్ ప్రకాశ్ వెల్లడించాడు. మావోయిస్టు నేతలతో ఈ మధ్య అరెస్టయిన సామాజిక కార్యకర్తలకు కూడా సంబంధాల ఉన్నట్లు నిరూపించడంలో భాగంగా ఈ లేఖను పోలీసులు కోర్టుకు సమర్పించారు.