ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన TRS పార్టీ మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఓ సందర్భంలో పోటీ చేసిన టీఆర్ఎస్....మొదటిసారి మహారాష్ట్రలో ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. గతంలో నాందేడ్ జిల్లాలోని 6 నియోజకవర్గాలను తెలంగాణలో కలపాలని నేతలు ఉద్యమించారు. ఇప్పుడు అదే నినాదంతో అక్కడ నుండి TRS టికెట్ పై పోటీచేసేందుకు కొందరు రైతులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రకు చెందిన పలువురు రైతులు టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ను అనుమతిని ఇవ్వాల్సిందిగా కోరారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలవుతున్నాయన్నారు రైతులు. తమ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాందేడ్ జిల్లాలోని 5 నియోజకవర్గాలైన డెగ్లూర్, నయ్ గావ్, బోకర్, హిమాయత్ నగర్, కిన్వట్ కు చెందిన పలువురు రైతులు తమ సమస్యలను సీఎం కేసీఆర్ కు తెలిపారు.
తమ పోరాటానికి మద్దతివ్వాలని సీఎం కేసీఆర్ను అభ్యర్థించారు. టీఆర్ఎస్ పార్టీ టికెట్లపై పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, ఈ పోటీతో ఎన్నకల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేకతను సృష్టించనుందని పలువురు చర్చించుకుంటున్నారు.
ఇదిలాఉండగా, తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన నేడు.. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం.. జై తెలంగాణ, జై హింద్ అని ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేసిన కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
మరోవైపు రైతుబంధు పథకం కింద ఈ ఏడాది 56.76 లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు రూ. 39.72 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. మిగిలిన రైతులకు చెల్లింపులు ప్రాసెస్లో ఉన్నాయన్నారు. గతేడాది రైతుబంధు పథకం కింద రూ.10,505 కోట్లు చెల్లించాం. ఎకరానికి పంటకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు రూ. 10 వేలు ఇస్తున్నాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద అనేక రకాల షరతులు ఉన్నాయని, దానికంటే తమ పథకం బాగుందన్నారు.