ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగా ఆటో, ట్యాక్సీ, మాక్సీ కాబ్లు నడుపుకుంటున్నవారికి ప్రభుత్వం చేయూతనందిస్తుంది. ఏడాదికి రూ.10వేల పథకం అమలుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ క్రమంలో మంగళవారం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయా శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ పధకం లబ్దికోసం దరఖాస్తులను తీసుకోవడం, వాటికి తనిఖీలు, ఆమోదంపై సీఎం జగన్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేసే పథకంలో భాగస్వాములు కావాలని రవాణా శాఖ అధికారులు పిలుపునిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఆటో టాక్సీ క్యాబ్ సొంతంగా కలిగిన ఉన్న డ్రైవర్లకు ఆర్థిక సహాయము చేసే పథకానికి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. ఈ క్రమంలో నాల్గోవ రోజు వరకు గుంటూరు జిల్లాలో 3935 దరఖాస్తులు నమోదయ్యాయని డి టి సి ఈ మీరా ప్రసాద్ తెలిపారు. స్థానిక డిటీసీ కార్యాలయంలో మంగళవారం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన లబ్దిదారులైన డ్రైవర్లకు డౌన్ లోడ్ కాపీలను డిటిసి అందజేశారు. ఈ సందర్బంగా డిటిసి మాట్లాడుతూ దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసే పక్రియను మరింత వేగవంతం చేస్తామన్నారు. ఈ పథకం అమలును విజయవంతం చేసే దిశగా ప్రభుత్వ సెలవు దినాలలో కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టుగా చెప్పారు. ఇందుకు జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లలో దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియను ఉద్యోగులతో చేపట్టామన్నారు.
మోటార్ వాహన తనిఖీ అధికారులు ద్వారా ఈ పథకం గురించి మండలస్థాయి గ్రామస్థాయిలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని ఆయన తెలిపారు ఈనెల 25వ తారీకుతో దరఖాస్తుల స్వీకరణ ముగియనుండడంతో ఈ పథకానికి అర్హులైన వారు త్వరగా ఆన్ లైన్ లో దరఖాస్తులను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఆన్ లైన్ దరఖాస్తులను నమోదు చేసుకున్నవారు మాన్యువల్ గా మరల దరఖాస్తులను ఆన్ లైన్ కేంద్రాల వద్ద ఇస్తున్నట్లుగా మా దృష్టికి వస్తున్నాయని చెప్పారు. ఒకసారి ఆన్లైన్లో దరఖాస్తును నమోదు చేసుకుంటే మాన్యువల్గా ఎవరికి దరఖాస్తులను ఇవ్వవలసినన అవసరంలేదని ఆయన స్పష్టం చేశారు. మీరు వాడుకొనే సెల్ ఫోన్ ద్వారా కూడా
www.aptransport.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. ఆటో/టాక్సీ క్యాబ్/ మాక్సి క్యాబ్ సొంతంగా కలిగిన యజమానులు వాహన సంబంధిత ఫిట్నెస్ సర్టిఫికెట్ గాని, పర్మిట్ గాని, ఇన్సూరెన్స్ గాని లేకపోయినా దరఖాస్తులు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ , రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్ సి) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే సరిపోతుందని అందుబాటులో ఉంటే కుల ధ్రువీకరణ పత్రం కూడా అప్లోడ్ చేయాలని ఆయన అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కాలపరిమితి లేకపోతే రెన్యువల్ చేయించుకోని దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు.
డ్రైవింగ్ లైసెన్స్ లో ఆటో రిక్షా, లైట్ మోటార్ వెహికల్ , ట్రాక్టర్ అండ్ ట్రైలర్ గాని, ఏదొకటి కలిగి ఉన్న కూడా డ్రైవింగ్ లైసెన్స్ సరిపోతుందన్నారు. భార్య పేరు మీద ఆటో/ టాక్సీక్యాబ్, మాక్సిక్యాబ్ వాహనం కలిగిఉండి, భర్తకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఎడల భార్యకు కూడా ఈ పథకానికి అర్హురాలు. కుటుంబంలో మేజర్ అయిన కుమారునికి వాహనం కలిగి అర్హత కలిగిన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. రేషన్ కార్డులో మీకు సంబంధం లేని ఆధార్ నంబరు లింకు అయినట్లైతే దానిని తీసి వేసి సొంత ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవాలన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ కు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కు లింక్ అయిన ఆధార్ నంబరు మీది కానియడల మీ ఆధార్ నంబర్ ను సంబంధిత రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి నమోదు చేసుకోవాలని చెప్పారు.ప్రస్తుతం వాడే మొబైల్ నెంబర్ ను మాత్రమే ఇవ్వాలన్నారు. అడ్రస్ నమోదు చేసేటప్పుడు ప్రస్తుతం ఉంటున్న అడ్రసును మాత్రమే నమోదు చేయాలి. దేనికి ఏవిధమైన ఆధారాలు ఇవ్వవలసిన ఆవసరం లేదన్నారు.ఆటో /టాక్సీక్యాబ్/మాక్సి క్యాబ్ వాహనం మన రాష్ట్రంలో అతనికి కలిగిఉండి, వేరొక రాష్ట్రానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే మన రాష్ట్రానికి చిరునామా మార్చుకోవాలన్నారు. దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదుకు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు (ఎర్రర్ ) వచ్చినా, అటువంటి దరఖాస్తులను మాన్యువల్ గా మీ వార్డు వాలంటీర్స్ గాని గ్రామ వాలంటీర్స్ గాని లేదా రవాణాశాఖ కార్యాలయంలో ఇవ్వాలని డిటీసీ తెలిపారు.