దివంగత నేత, అసెంబ్లీ
మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావును మానసిక క్షోభకు గురిచేసింది చంద్రబాబునాయుడే
అంటూ తేలిపోయింది. కోడెల మానసిక క్షోభకు
మీరు కారణమంటే కాదు మీరే కారణమంటు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు యుద్ధం
నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ
నేపధ్యంలోనే మూడో పార్టీ వివాదంలోకి ఎంటర్
అయ్యింది.
అదే భారతీయ జనతా పార్టీ. బిజెపి అధికార ప్రతినిధి పురిపళ్ళ రఘురామ్ మాట్లాడుతూ చంద్రబాబు తాను మానసిక క్షోభకు గురి అవుతున్నట్లు వాపోయారని చెప్పటం సంచలనంగా మారింది. తెలుగుదేశంపార్టీలో తాను ఒంటరిని అయిపోయినట్లు తనతో చెప్పుకుని బాధపడిపోయారట. దాదాపు నెల రోజుల క్రితం కోడెలకు తనకు ఫోన్ చేసినట్లు కూడా రఘురామ్ చెప్పటం కలకలం రేపుతోంది.
తనతో కోడెల ఫోన్ లో మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీలో చంద్రబాబు తనను ఒంటరిని చేసేసినట్లు తెగ బాధపడిపోయారని చెప్పారు. చంద్రబాబు తనను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారని ఫీలైనట్లు బయటపెట్టారు. నిజాయితీతో పనిచేసే నాయకులకు టిడిపిలో విలువ లేదని కూడా వాపోయారట. పార్టీలో తనను ఒంటరిని చేసేయటంతో తాను మానసిక క్షోభకు గురవుతున్నట్లుగా కోడెల ఫీలైనట్లు రఘురామ్ చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోంది.
పై కారణాలతోనే తాను టిడిపిలో ఇమడలేకపోతున్నట్లు చెప్పుకుని ఫీలయ్యారట. అందుకనే తాను టిడిపికి రాజీనామా చేసేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా చెప్పారట. తాను బిజెపిలో చేరాలని అనుకుంటున్నట్లు చెప్పిన కోడెల అమిత్ షా అపాయిట్మెంట్ కావాలని అడిగారని పురిపళ్ళ చెప్పటంతో వివాదం కీలక మలుపు తిరిగింది.
ఏ సంగతి అమిత్ షా తో మాట్లాడి చెబుతానని తాను చెప్పిన కొద్ది రోజులకే కోడెల ఆత్మహత్య చేసుకోవటం దురదృష్టకరమని రఘురామ్ వాపోయారు. సో రాఘురామ్ తాజా ప్రకటనతో కోడెలను మానసిక క్షోభకు గురిచేసింది చంద్రబాబే అని తేలిపోయింది. తప్పులన్నీ తన వైపు పెట్టుకుని ఎదుటి వాళ్ళపై బురద చల్లటం చంద్రబాబు అండ్ కో కు మామూలే అన్న విషయం మరోసారి తేలిపోయింది.