జాబిలమ్మపై దిగాలని ఇస్రో చేసిన ప్రయత్నం చాలా వరకు విజయవంతం అయినా.. చివరి క్షణంలో కొంత నిరాశను మిగిల్చింది. విజయానికి నిమిషం దూరంలో ఆగిపోవడం బాధాకరమైన విషయమే. ప్రపంచం యావత్తు ఇస్రోను మెచ్చుకున్నది. తక్కువ ఖర్చుతోనే అలా చేయడం అంటే మాములు విషయం కాదు. చాలా కష్టంతో కూడుకున్నది కూడా. యావత్ భారతదేశం ఇస్రో వెనుక ఉన్నామని ఇప్పటికే స్పష్టం చేశారు. సాహసం చేశాం. 95% శాతం విజయవంతం అయ్యాం. అంతకంటే కావాల్సింది ఏముంది.
మునుముందు చేయాల్సింది ఇంకా ఎంతో ఉన్నది. తప్పకుండా విజయం సాధిస్తాం అని ఇస్రో చెప్తున్నది. రాబోయే రెండేళ్లలో ఇస్రో చాలా ప్రయోగాలు చేపట్టబోతున్నది. అందులో కీలకమైనది గగన్ యాన్. దీనికంటే ముందు మరో ఏడాదిలో మానవరహిత ప్రయోగం చేయబోతున్నది. దాని తరువాత మానసహిత ప్రయోగం చేస్తుంది. ఇప్పటికే కొంతమందిని సెలక్ట్ చేసింది. వారికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. త్వరలోనే గగన్ యాన్ ప్రాజెక్ట్ కోసం వారు సిద్ధం అవుతున్నారు.
దీంతోపాటు ఇస్రో, చంద్రునిపై చంద్రయాన్ 3 ప్రయోగం కోసం సిద్ధం అవుతున్నది. ఈసారి ఇస్రో ప్రయోగాల కోసం కేంద్రం భారీ బడ్జెట్ ను ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. పైగా ఇప్పుడు ఇండియా ఇతరదేశాల చెందిన ఉపగ్రహాలను కూడా రోదసీలోకి ప్రవేశపెడుతూ కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఈ ఆదాయంతో సగం ఖర్చుకే ప్రయోగాలు చేస్తున్నట్టు లెక్క.
షార్ట్ రేంజ్ ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టేందుకు వాటికీ తగిన రాకెట్లను తయారు చేసే పనిలో నిమగ్నం అయ్యింది ఇస్రో. ఇవి రెడీ అయితే.. కమర్షియల్ గా ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెట్టొచ్చు. అంతరిక్ష మార్కెట్లో కనీసం ఇండియా 10% వాటాను దక్కించుకున్నా చాలు. అలా వచ్చే ఆదాయంతోనే ఇస్రో ప్రయోగాలు చెయ్యొచ్చు. ప్రభుత్వ బడ్జెట్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అందుకే షార్ట్ రేంజ్ రాకెట్ తయారీలో ఇస్రోఇంజనీర్లు శ్రమిస్తున్నారు. ఇండియా మొదటితరం ఉపగ్రహం రోహిణి తరహా ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెట్టబోతున్నది ఇండియా.