వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీని పరిపాలించింది కేవలం ఐదేళ్లే.. కానీ ఇప్పటివరకూ ఏపీని పాలించిన ముఖ్యమంత్రులందరిలోకీ చిరస్థాయిగా గుర్తుండిపోయే ఖ్యాతి సంపాదించుకున్నారు. అందుకు ప్రధాన కారణం. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన అనేక పథకాలు ప్రారంభించారు. వాటిలో మానవీయత ఉట్టి పడుతుంది.


ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే బాటలో ముందుకు వెళ్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానసపుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పథకానికి మరోసారి జవసత్వాలు సమకూరుస్తూ తాజాగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు చూస్తే తండ్రి తగ్గ తనయుడు అనిపించక మానదు. ఆరోగ్యశ్రీకి ఊపిరిపోస్తూ జగన్‌ కొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం విధించాలని, ఆ మేరకు డాక్టర్ల జీతాలు పెంచాలన్న నిపుణుల కమిటీ సిఫారసులను అంగీకరించారు.


ఇక ఆరోగ్య శ్రీకి సంబంధించి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. నవంబర్‌ 1 నుంచి ప్రారంభం, డిసెంబర్‌ 21 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల జారీ ప్రారంభమవుతుంది. ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా మరికొన్ని వ్యాధులు చేర్చారు. జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలవుతాయి.


ఏకంగా 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు అమలు చేస్తారు. 12 వందల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ మిగిలిన జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తారు. రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి జిల్లాల వారీగా అమలు చేస్తారు. ఆపరేషన్‌ చేయించుకున్నవారు కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ. 5 వేల చొప్పున సాయం అందిస్తారు.


తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి నెలకు రూ. 10 వేల పెన్షన్‌ను ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులను ఒక కేటగిరి కిందకు తీసుకొచ్చి నెలకు రూ. 5 వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. దీనిపై మార్గదర్శకాలు తయారు చేయాలని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: