పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందనే సామేత లా ఉంది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో కయ్యాలు ముదిరి పాకాన పడుతుండటంతో గులాబీ దళపతి కేసీఆర్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో ఆది నుంచే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఒకరు ఎడ్డెం అంటే ఒకరు తెడ్డెం అంటారు. అందుకే కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్లకు నాయకత్వం ఎంతో బలంగా ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు రోజు రోజు కు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. పాత తరం నేతలది ఒకదారి అయితే యువ నాయకత్వాన్ని మరోదారిగా ఉంటుంది.
ఇక వెటరన్ కాంగ్రెస్ నేతలంతా ఎవరి తోచిన విధంగా వారు నడుచుకుంటుంటే .. ఇతర పార్టీనుంచి వచ్చినవారు మాత్రం ఓ పద్దతి పాడు తేదా అంటూ నేతలపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇది నచ్చని నేతలు మీరు ఇప్పుడొచ్చి మాకు నీతులు చెపుతున్నారా.. ఇట్లాగే ఉంటాము మేము.. మీరు చెప్పినట్లు ఉండమననికి మీరేమాన్న మాకు హైకమాండా అని నిలదీస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్న సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కుందూరు జానారెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డిలు ఒక్కటై గ్రూపు తగాదాలకు స్వస్తి చెప్పగా, ఈ ముగ్గురు కలిసి మల్కాజ్గిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా మారారు.
కోమటిరెడ్డి, కుందూరు, ఉత్తమ్లు వేర్వేరు గ్రూపులు నడిపిన నేతలు రేవంత్ వ్యాఖ్యాలతో ఒక్కతాటిపైకి వచ్చారు. వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో హూజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికతో గ్రూపు తగాదాలు రాష్ట్ర కమిటీలో పతాకస్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్లో హూజూర్నగర్ ఉప ఎన్నిక చిచ్చు రేపుతుండటంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఖుషీ అవుతున్నారు. వాస్తవానికి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్కు తిరుగులేని పార్టీగా ఉంది. అయితే హూజూర్నగర్ ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని, కాంగ్రెస్ను చావుదెబ్బ తీయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
అయితే బలమైన కాంగ్రెస్ను ఎలా దెబ్బతీయాలా అని ఎదురుచూస్తున్న కేసీఆర్కు అనుకోని ఆయుధాన్నే కాంగ్రెస్ నేతలు అందించారు. ఎంపీ రేవంత్రెడ్డి హూజూర్నగర్లో ఉత్తమ్ కుమార్రెడ్డి భార్యను ఎలా నిలుపుతారని ప్రశ్నించడంతో ఉత్తమ్ కుమార్రెడ్డి రేవంత్పైన ఎదురు దాడి చేయడం జరిగింది. అదే విధంగా ఇంత కాలం ఎడమొహం పెడమొహంగా ఉన్న ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి రేవంత్పై ఫైర్ అయ్యారు. అసలు మాకు చెప్పడానికి నీవు ఎవరు.. మా జిల్లాలో మేము అభ్యర్థులను ఎంపిక చేసుకోగలం.. నీవేవరు అభ్యర్థిని ఖరారు చేయడానికి అంటూ ఎదురుదాడి చేశారు. ఇప్పటికే ఉత్తమ్ రెడ్డి నాయకత్వంలో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని రేవంత్ గుర్తు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు హూజూర్నగర్ అభ్యర్థి ఎన్నిక అటు ఉత్తమ్, ఇటు రేవంత్ వర్గాల నడుమ గ్రూపు తగాదాలకు దారి తీసింది. ఈ గ్రూపు తగాదాలతో హూజూర్నగర్ ఎన్నికను కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ గ్రూపులను అసరా చేసుకుని ముందుకు పోయేందుకు సిద్ధమవుతున్నారట. సో కాంగ్రెస్లో ఉన్న అనైక్యత, గ్రూపు తగాదాలు ఇప్పుడు కేసీఆర్కు వరంగా మారాయని చెప్పవచ్చు.. కాంగ్రెస్ లోని పోరును అనుకూలంగా మార్చుకునే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారట.