రాను రాను ప్రపంచం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కొద్ది,మనుషుల జీవనానికి అవకాశాలు సమృద్దిగా దొరుకుతున్నాయి.వాటితో పాటే కొత్త కొత్త రోగాలు కూడా పుట్టు కొస్తున్నాయి.కొన్ని రోగాలు మందులకు తగ్గితే,మరిన్ని వ్యాదులు చికిత్సలకు లొంగడం లేదు.ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అన్ని సౌకర్యాలున్న మనిషి ఒంటరివాడే, వ్యాధి గ్రస్తుడే ఎందుకంటే ఎప్పుడు ఏ కొత్తరోగం అంటుకుంటుదో చెప్పలేం.మనకు తెలియకుండానే ఈ దేహాన్ని వ్యాదులకు నిలయంగా మారుస్తున్నాం.ఇవన్ని పక్కన పెడితే ఇప్పుడు ప్రపంచానికి ఓ కొత్త వైరస్ ప్రమాదం పొంచి ఉందని,ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నివేదిక చెబుతోంది.
ఈ వైరస్ విజృంభిస్తే,కేవలం 36 గంటల్లో అతి వేగంగా వ్యాప్తి చెంది,80 మిలియన్ల మందిని పొట్టనపెట్టుకుంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.'ఏ వరల్డ్ ఎట్ రిస్క్'శీర్షికతో రూపొందించిన ఈ నివేదికను అమెరికాలో విడుదల చేసింది.అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్,ప్రపంచానికి సోకే ప్రమాదముందని,దీని వల్ల 50 నుండి 80 మిలియన్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడే ప్రమాదముందని ఈ నివేదికలో వెల్లడించారు.ఈ వైరస్ వల్ల సోకే శ్వాసకోశ వ్యాధి ప్రాణాంతకరంగా మారి వేగవంతంగా ప్రాణాలను తీస్తుందని హెచ్చరించింది.ఇలాంటి వైరస్లను అరికట్టేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని డబ్ల్యూహెచ్ఓ మాజీ డైరెక్టర్ జనరల్,నార్వే మాజీ ప్రధాని డాక్టర్ గో ఆర్లెం బ్రుండట్లాండ్ నాయకత్వంలోని జీపీఎంబీ బృందం హెచ్చరికలను జారీ చేస్తోంది.
ఇక ఈ వైరస్ ఏ దేశానికి,అందులో ఏ ప్రాంతానికి సోకే అవకాశముంటుందో కూడా ప్రపంచ పటంపై ఈ బృందం మార్కు చేసి చూపించింది.అంటే నిఫా,కలరా,చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వైరస్లు ఏయే దేశాలను చుట్టుముడతాయో జీపీఎంబీ బృందం ఇదివరకు మ్యాప్లో చూపించింది.వాటికి సంబంధించి తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలను కూడా వివరించింది.ఇప్పుడు ఇంకా పేరు పెట్టని ఈ వైరెస్ గురించి హెచ్చరిస్తుంది.దీనిపైన మరిన్ని పరిశోధనలు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఈ బృందం పేర్కొంది.చూసారుగా ఇప్పటి మానవుడు పూలపానుపుల్లో బ్రతుకుతున్నానని భ్రమపడుతున్నాడు కాని తెలియకుండానే వాటికి ముళ్లు తయారవుతున్నాయని గుర్తించలేకపోతున్నాడు.