బతుకమ్మ పండుగకు ప్రతిఏటా మహిళలకు ఆడపడుచు కానుకగా తెలంగాణ సర్కారు ఇచ్చే బతుకమ్మ చీరెలను ఈ నెల 23 నుంచి పంపిణి చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్దమైంది. గత ఏడాదికి భిన్నంగా ఈ ఏడాది బతుకమ్మ చీరెలను 100 వెరైటీల్లో తయారుచేయించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు బతుకమ్మ చీరల పంపిణి అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు.
తెలంగాణ సర్కారు మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరల పంపిణి చేయాలని ఓ విధాన నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచనలో నుంచి పుట్టిన ఈ ఆడపడుచుల కానుక తెలంగాణ వ్యాప్తంగా ఎంతో విజయవంతం చేసింది ప్రభుత్వం. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, అంతకు ముందు కూడా సిరిసిల్లలో పనులు లేక అనేకమంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఉపాధి లేక భీవండి, సూరత్ వంటి ప్రాంతాలకు వలసపోయి అక్కడ బట్టల మిల్లుల్లో పనులు చేసుకుంటూ చాలీచాలని వేతనాలతో కుటుంబాలను ఎలాగోలా నెట్టుకొచ్చేవారు. అయితే కొందరు నేతన్నలకు వేతనాలు సరిపోక, కుటుంబాలను పోషించలేక మగ్గం తాళ్ళనే ఉరితాళ్ళుగా చేసుకుని ఆత్మహత్యలు చేసుకునేవారు. దీంతో ఛలించిపోయిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే నేతన్నల వలసలు లేకుండా చేయాలని, బంగారు తెలంగాణలో ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలని అనుకున్నాడట.
అందుకే నేతన్నలకు చేతినిండా పనికల్పించి వారి కుటుంబాలు నాలుగు మెతుకులు తిని పిల్లాపాపలతో సంతోషంగా గడపాలని, వారి కళ్ళల్లో ఆనందం నింపాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం. ఇలా ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు గత మూడేళ్ళుగా చీరల పంపిణి కార్యక్రమం చేపట్టి విజయవంతం చేస్తుంది. ఈ కార్యక్రమంతో నేతన్నలకు చేతినిండా ఏడాదంతా పని దొరుకుతుంది.
అయితే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18 ఏండ్ల్లు పైబడిన మహిళలందరికి 1.02 కోట్ల మంది అర్హులైన మహిళలకు అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం రూ.313 కోట్లు కెటాయిందింది. ఇప్పుడు ఈ కార్యక్రమంతో బతుకమ్మ చీరెల ద్వారా 16 వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి దొరికిందని, 26 వేల మరమగ్గాల ద్వారా వీటిని తయారు చేస్తున్నారు. ఈ ఏడాది 10 రకాల డిజైన్లు, 10 రకాల రంగుల్లో మొత్తం 100 వెరైటీల్లో చీరెలను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు.
తెలంగాణ లోని అన్ని జిల్లాలకు చీరెలను చేరవేసారు. గతంలో మరమగ్గం కార్మికులకు నెలకు రూ.8వేల నుంచి రూ.12వేలు ఇచ్చే ప్రభుత్వం ఈ ఏడాది బతుకమ్మ చీరెల తయారీ తర్వాత రూ.16వేల నుంచి రూ.20వేల ఇస్తున్నారు. బతుకమ్మ చీరలను గ్రామస్థాయిలో పంచాయతీ, గ్రామ రెవెన్యూఅధికారి, గ్రామ మహిళాసంఘం ఆఫీసు బేరర్, రేషన్షాపు డీలర్.. వార్డుస్థాయి కమిటీలో బిల్కలెక్టర్, వార్డు మహిళాసంఘం ఆఫీసుబేరర్, రేషన్డీలర్ సభ్యులుగా ఉంటారు. రేషన్ షాపుల్లో ఈ చీరలను పంపిణి చేస్తారు. ఈ చీరలను ఈనెల 23 నుంచి పంపిణి చేసేందుకు సర్కారు సమాయత్తం అయింది.