తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పేద మహిళలు ఆధారపడే బీడీ తయారీ పరిశ్రమపై జిఎస్టీ ఎత్తివేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. శుక్రవారం గోవాలో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.


తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి బీడీ తయారీ యూనిట్లున్నాయని, వీటిలో 5 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని హరీశ్ వివరించారు. ఇందులో 90 శాతానికిపైగా పేద మహిళలే ఉన్నారని, బీడీలు చుట్టడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినప్పటికీ జీవనోపాధి కోసం ఈ పని చేయకతప్పడం లేదని చెప్పారు. వీరిని ఆదుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక్కొక్కరికీ నెలకు రూ.2016 చొప్పున ఆసరా పెన్షన్ అందిస్తున్నదని వెల్లడించారు.


కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను, బీడీల తయారీని, బీడీ ఆకుల వ్యాపారాన్ని జిఎస్టీ పరిధిలోకి తెచ్చి, భారీగా పన్నులు విధించడం వల్ల బీడీల వ్యాపారంపై ప్రభావం చూపుతున్నదన్నారు. బీడీ వ్యాపారంపై పడే ప్రభావం లక్షలాది మంది మహిళల జీవితాలతో ముడిపడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీడీలపై 28 శాతం జిఎస్టీ ఉందని, బీడీ ఆకులపై 18 శాతం జిఎస్టీ ఉందని, ఇంత మొత్తంలో బీడీలపై పన్నులు ఉండడం వల్ల పరిశ్రమ దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పారు. మహిళల ఆర్థిక పరిస్థితులతో సంబంధం కలిగిన అంశం కాబట్టి, బీడీలపై జిఎస్టీని ఉపసంహరించాలని మంత్రి హరీశ్ కోరారు.


మంత్రి హరీశ్ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. బీడీ కార్మికులు, ముఖ్యంగా బీడీలు చేసే మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై సమగ్రమైన ప్రతిపాదనలు అందచేయాలని మంత్రి హరీశ్ ను కేంద్ర మంత్రి కోరారు. ప్రత్యేకంగా చొరవ తీసుకుని బీడీ కార్మికుల పునరావాసం కోసం ఆలోచన చేస్తే, దేశమంతటికీ ఉపయోగపడే విధానం తీసుకురావడానికి ప్రయత్నిస్తామని నిర్మలా సీతారామన్ మంత్రి హరీశ్ కు హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: