వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే విజయవాడ కరకట్టపై అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును అక్కడి నుంచి ఖాళీ చేయించాలనే ఉద్దేశంతోనే పక్కనే ఉన్న ప్రజావేదికను కూడా కూల్చేశారని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. ఆ తర్వాత వరదల సమయంలోనూ చంద్రబాబు ఇంటిని ముంచేయాలని ప్రభుత్వం ప్రయత్నించిందని టీడీపీ నేతలు ఆరోపించారు.


ఈ నేపథ్యలో ఇప్పుడు చంద్రబాబుకు ప్రభుత్వం మరో డెడ్ లైన్ విధించారు.. ఈసారి ఆయనకు కేవలం వారం రోజులే సమయం ఇచ్చారు. ఈ డెడ్ లైన్ దేనికోసం అంటే.. కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూల్చేందుకు.. ఇప్పుడు ఈ భవనాన్ని వారం రోజుల్లో కూల్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.


ఇప్పటికే చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాసానికి సీఆర్‌డీఏ నోటీసులు అంటించింది. అక్రమ కట్టడాలను వారంలోగా తొలగించాలని ఆ నోటీసుల్లో సీఆర్‌డీఏ అధికారులు పేర్కొన్నారు. అక్రమ కట్టడాల యజమానులు ఆ పని చేయకపోతే.. తామే తొలగిస్తామని ఇంటి యజమాని లింగమనేని రమేష్‌కు నోటీసులు అందిచారు. ఆయన ఆ భవనంలో ఉండటం లేదు కాబట్టి.. భవనం గోడకు నోటీసులు అంటించారు సీఆర్‌డీఏ అధికారులు..


తాము ఇప్పటికే ఒకసారి గతంలో నోటీసులు జారీ చేసామని కొత్త నోటీసులో తెలిపారు. కానీ దానికి భవన యజమాని నుంచి సంతృప్తికర సమాధానం రాలేదని నోటీసుల్లో తెలిపారు. దీన్నిబట్టి చూస్తే మరో వారం రోజుల్లో చంద్రబాబు నివాసం ఉంటున్న అద్దె భవనాన్ని కూల్చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. పోలవరం కట్టడం అంటే.. తన ఇంటికి నోటీసులు ఇచ్చినంత సులభం కాదని.. చంద్రబాబు నిన్న కామెంట్ చేశారు. ఆయన అలా అన్న కొన్ని గంటల్లోనే మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. మరి ఈ నోటీసులపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో.. మళ్లీ ఏ ఉద్యమం చేస్తారో.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: