ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగులకు నిర్వహించిన రాత పరీక్షా పత్రం లీక్ అయిందని ఒక తెలుగు దినపత్రిక లో వచ్చిన కథనాలపై వైకాపా నేతలు భగ్గుమంటున్నారు. పరీక్ష రాసి ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువత లో అనుమానాలు సృష్టించాలనే కుటిల యత్నాన్ని సదరు దినపత్రిక యాజమాన్యం చేస్తున్నట్లు స్పష్టం అవుతుందని అంటున్నారు . గ్రామ సచివాలయ ఉద్యోగులకు నిర్వహించిన ప్రశ్న పత్రం లీక్ అయిందని, ఆ పత్రిక లో కథనం రావడమే ఆలస్యమని తెలుగుదేశం పార్టీ నేతలు రంగం లోకి దిగి రచ్చ చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు . ఒకవేళ పేపర్ లీక్ అయిందే నిజమైతే ఆ దమ్మున్న దినపత్రికలో ఎందుకు అదే రోజు వార్త రాయలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
గ్రామ సచివాల ఉద్యోగుల ఫలితాలను వెల్లడించిన మరుసటి రోజు , పరీక్షా పత్రం లీక్ అయిందంటూ కథనం వండి వార్చడం చూస్తుంటే జగన్ ప్రభుత్వం పై బురద చల్లడమే సదరు పత్రిక యాజమాన్యం లక్ష్యమని వెల్లడి అవుతోందని అంటున్నారు . ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ తో దిక్కుతోచనిస్థితి లో పడిపోయిన ఎల్లో మీడియా, ఇష్టారీతిన కథనాలు వండి వారుస్తోందని ఎమ్మెల్యేలు డీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. ఒక్క గ్రామ సచివాలయ ఉద్యోగాల పైనే కాకుండా రివర్స్ టెండరింగ్ పై కూడా ఆ టీడీపీ అనుకూల పత్రిక తప్పుడు కథనాలు రాసిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము రాసిన కథనాలకు కట్టుబడి ఉన్నట్లయితే , సదరు పత్రిక యజమాని బహిరంగ చర్చకు రావాలని సుధాకర్ బాబు సవాల్ విసిరారు . జగన్ చేస్తోన్న మంచి పనులేవీ ఆ పత్రికకు కన్పించవన్న ఆయన , ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు సంబంధించి 19 చారిత్రక బిల్లులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం ఆ పత్రిక యజమానికి కనిపించలేదా అంటూ నిలదీశారు .