టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో మృతిచెందిన సంగతి తెలిసిందే. అజాతశత్రువుగా అందరితోనూ కలిసి మెలిసి ఉండే శివప్రసాద్ మృతి చెందడంతో ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితోనూ ఆయనకు అనుబంధం ఉన్న విషయం ఒకటి బయటకు వచ్చింది.
శివప్రసాద్ టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన బాబకు క్లాస్మెట్ అయినా ఇటు మరో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫ్యామిలీతో సైతం ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. శివప్రసాద్కు రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డితో అనుబంధం ఎక్కువ.
ఆ పరిచయం కారణంగానే రాజశేఖర్రెడ్డి శివప్రసాద్కు 1996లో తిరుపతి ఎంపీ టికెట్ ఆఫర్ చేశారు. అయితే దీనికి మరో మాజీ సీఎం నేదురుమిల్లి జనార్థన్రెడ్డి అడ్డు తగిలారు. దీంతో ఆయననకు టిక్కెట్ దక్కలేదు. చివరకు ఆయన ఆ తర్వాత టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
ఇక వ్యక్తిగతంగా రాజారెడ్డితో ఉన్న అనుబంధం కారణంగా..ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పెళ్లి నేపథ్యంలో తిరుపతి నుంచి శివప్రసాద్.. తిరుపతి ప్రస్తుత ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇద్దరు కలిసి వందలాది వాహనాల్లో జనాలను తీసుకెళ్లిన వైనం ఇప్పుడు అందరూ గుర్తు చేసుఉంటున్నారు. ఆ తర్వాత శివప్రసాద్ టీడీపీలో చేరినా రాజారెడ్డితో అనుబంధం మాత్రం తగ్గలేదని చెబుతారు.
ఇక ప్రేమతపస్సు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నప్పుడు ఆయనకు టీడీపీ నుంచి ఎంపీ సీటు ఆఫర్ వచ్చింది. అప్పట్లో ఆయన సినిమాల మీద ఆసక్తితో రాజకీయాల్లోకి వెళ్లలేదు. ఆ తర్వాత టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలవగా.. తాజా ఎన్నికల్లో ఓడిపోయారు.