తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగాయి. పది రోజుల పాటు అధికార...విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయటానికి  ప్రతిపక్షం చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. సభ నడిచినన్ని రోజులూ అపోజిషన్ కు కౌంటర్లు ఇచ్చారు అధికారపక్ష సభ్యులు. ఈ సారి సభలో విపక్షం బలం తేలిపోయినట్లుగానే కనిపించింది.  అటు...అధికారపక్షం అదే రేంజ్ లో చెలరేగిపోయింది. పది రోజుల పాటు నడిచిన తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం.. సభ నిరవధికంగా వాయిదా పడింది. మరోవైపు సభ వాయిదాకు ముందు అసెంబ్లీ కమిటీలను ప్రకటించారు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి.


తెలంగాణ శాసనసభలో పలు కమిటీలను నియమిస్తూ.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌ పదవి ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని వరించింది. అలాగే అంచనాల కమిటీ ఛైర్మన్‌గా సొలిపేట రామలింగారెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా జీవన్ రెడ్డిని స్పీకర్ నియమించారు. 


పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించినప్పటికీ.. తదనంతరకాలంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో హస్తం బలం తగ్గింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడంతో.. అసెంబ్లీలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఆ హోదా టీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీకి దక్కింది. ప్రతిపక్ష సభ్యులు కూర్చోవాల్సిన స్థానాలను స్పీకర్ ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు కేటాయించారు. దీంతో.. ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కింది. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, ప్రకాశ్‌ గౌడ్, అబ్రహం, శంకర్‌ నాయక్, దాసరి మనోహర్‌ రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, అహ్మద్ పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్‌లను నియమించారు. పది రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సెషన్ లో 58 గంటల 6 నిమిషాల పాటు సమావేశాలు సాగాయి. ఈ సమావేశాల్లో మూడు బిల్లులతో పాటు ఒక  తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: