ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె. చంద్రశేఖర్ రావు సోమవారం హైదరాబాద్లో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్కు చేరుకుంటారు. ఇక్కడే వీరిద్దరూ సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీక రణ చట్టం - 2014 లోని పరిష్కారం కాని అంశాలు, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకం, ఉద్యోగుల విభజన, ఇతర పెండింగు అంశాలు, జలవనరుల సద్వినియోగం, ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పెండింగు విద్యుత్తు బిల్లులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.
అదేసమయంలో ఏపీలో ఇటీవల జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురూ చర్చించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యను టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా వాడుకోవడంపై ఇరువురుసీఎంలు ఆఫ్ది రికార్డుగా చర్చించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రివర్స్ టెండర్ల విషయాన్ని, ముఖ్యంగా పోలవరంలో తాజాగా రివర్స్ ద్వారా 58 కోట్లను ఆదా చేసిన విషయాన్ని కూడా ప్రస్థావించే అవకాశం కనిపిస్తోంది.
రాబోయే రోజుల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలు, అదేసమయంలో కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణలో విజయవంతం అయిన తీరు, దీనిని ఏపీలో ఎలా అమలు చేయాలనే విషయంపై సీఎం కేసీఆర్ వివరించే ఛాన్స్ కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా వీటితోపాటు ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడంతోపాటు నీటి వనరుల సమగ్ర సద్వినియోగంపై గతంలో రెండు రాష్ట్రాల సీఎంల సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, మంత్రులు, సలహాదారులు, ముఖ్య కార్యదర్శులు హైదరాబాద్లో సమావేశమై చర్చించిన విషయం విదితమే.
చర్చల కొనసాగింపులో భాగంగా తర్వాత ఇరు రాష్ట్రాల ప్రభుత్వ, ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు సమావేశమై చర్చించారు. ఈ చర్చలన్నీ సామరస్యపూర్వక వాతావరణంలో జరిగిన నేపథ్యంలో సోమవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతున్నారు.