2014లో తెలుగుదేశం పార్టీ సడెన్ గా ఓ వ్యక్తిని తెరమీదకు తీసుకొచ్చింది. పార్టీలో ఎమ్మెల్సీని చేసింది అక్కడితో ఆగకుండా ఆయనకు మినిస్ట్రీ పదవి ఇచ్చింది. అలా ఇన్స్టెంట్ గా రాజకీయాల్లోకి వచ్చి పదవులు అలంకరించిన వ్యక్తి ఎవరో కాదు నారాయణ విద్యాసంస్థల ఓనర్ నారాయణ. నారాయణ విద్యాసంస్థలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక నగరాల్లో విస్తరించి ఉన్నది. 2014లో తెలుగుదేశం పార్టీకి ఆర్ధికంగా సపోర్ట్ చేయడంతో ఆయనకు పదవిని కట్టబెట్టారు అన్నది ఓపెన్ సీక్రెట్. అంతేకాదు, అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన తరువాత అక్కడ తక్కువ ధరలకు అయన భూములు కొనుగోలు చేశారని కూడా వార్తలు వచ్చాయి.
కాగా, 2019లో పార్టీ ఓడిపోయింది. 2019లో పార్టీ ఓటమిపాలయ్యాక.. నారాయణ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీకి దూరంగా ఉండటంతో పాటు ఇప్పుడు అయన బీజేపీ వైపు చూస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా అయన హాజరు కావడం లేదు. అంతేకాదు, బీజేపీ నేతలతో ప్రస్తుతం టచ్ లో ఉన్నారని కూడా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నారాయణ ఆర్ధికంగా బలమైన వ్యక్తి. ఎన్నికల సమయంలో అవసరమైన సహాయ సహకారాలు కూడా ఉంటాయి.
ఇది ఆయనకు కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీలో ఉంటె.. ఎలాంటి ఉపయోగం ఉండకపోగా.. భవిషత్తులో కోర్టు కేసులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా నారాయణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు మరి కొందరి ద్వారా ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వర్తమానం పంపారని.. త్వరలోనే పార్టీలో చేరబోతున్నారనే సంకేతాలు పంపుతున్నారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాజకీయంగా బలం పుంజుకోవాలని చూస్తున్నది. వైకాపాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్నది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో చాలా వరకు బలహీన పడింది. కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా మారిపోయింది. అలానే ఏదో సాధిస్తారని అనుకున్న జనసేన పార్టీ ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి రావడంతో అందరి చూపులు బీజేపీ వైపు సారిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నది. 2024లో కూడా బీజేపీనే అధికారంలోకి వస్తుంది అందులో సందేహం అవసరం లేదు. ఇప్పటికే 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ మరో ఆరు రాష్ట్రాల్లో అలయన్స్ తో అధికారంలో ఉన్నది.