- ఓ వెలుగు వెలిగిన ‘నాగం’ ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు
- ఎదురు దెబ్బలకు కోలుకోలేకపోతున్న ‘నాగం’
- తెలంగాణలో జీర్ణించుకోలేకపోతున్న అనుచరులు, అభిమానులు
తెలంగాణలో ఇప్పుడు ఓ కొత్త అంశం తెరపైకి వస్తోంది. జనాల్లో ఆయన గురించే చర్చించుకుంటున్నారు. ఆయనెవరరో కాదు... మన తెలంగాణ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. ఈ పేరు అందరరికి తెలిసే ఉంటుంది. పెద్దగా పరిచయం చేయనక్కరలేదు. కానీ ఇప్పుడు ఆయన పేరు వినిపించడం లేదు. కనీసం మనిషి కూడా కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు ఏమయ్యాడనేది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాగం జనార్ధన్కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయన కోలుకోలేకపోయారు. ఇంతకీ ఇప్పుడు నాగం భవిష్యత్తు ఏమిటి..? రాజకీయాల్లో ఆయన మనుగడ కొనసాగేనా..? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది.
ఎక్కడి నాగం:
నాగం జనార్ధన్రెడ్డి మే 22, 1948లో మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు మండలం నాగపూర్ గ్రామంలో జన్మించిన నాగం జనార్థన్ రెడ్డి ఊరుపేరే ఇంటిపేరైంది.నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎన్నికయ్యారు. అయితే వైద్య విద్య పూర్తయ్యాక 1976లో నాగర్ కర్నూల్ లో వైద్యునిగా ప్రాక్టీసు మొదలు పెట్టారు నాగం జనార్థన్ రెడ్డి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 1983లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశారు. 52 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్ళీ 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. 1989 లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 1994 లో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ సంపాదించి విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఐదు సార్లు నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో సవాల్ విసిరిన ‘నాగం’
తెలుగుదేశం ప్రభుత్వంలో పలు మంత్రిపదవులు చేపట్టారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి, పదవికి రాజీనామా చేసి సొంతంగా తెలంగాణ నగరా పార్టీని స్థాపించారు. 2012 ఉప ఎన్నికలలో ఇండిపెండెంటుగా బరిలోకి దిగి మరో సారి విజయం సాధించారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉవ్వెత్తున జరుగుతున్న ఉద్యమం సమయంలో కేసీఆర్ టీడీపీ తెలంగాణ నాయకులపై దుమ్మెత్తిపోశారు. రాజీనామాలు చేసి మాతో కలిసి రావాలని లేకపోతే వారు ద్రోహుల కిందే లెక్కంటూ, దమ్ముంటే అందరు రాజీనామా చేసి రావాలని సవాల్ విసిరారు.ఇదే సమయంలో ఉద్యమం పెద్ద ఎత్తున జోరందుకుంది.
యూనివర్సిటీలో ఎదురు దెబ్బ:
క్రమంలో టీడీపీ తెలంగాణ నేతల బృందం ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లింది. అదే సమయంలో ఉద్యమంలో ఉన్న విద్యార్థులు టీడీపీ నాయకులను బంతాట ఆడుకున్నారు. అందులో ముఖ్యంగా నాగం జనార్థన్ రెడ్డి కారును ధ్వంసం చేయడంతో పాటు తీవ్రంగా కొట్టారు. ఇక్కడే ఆయన కథ మలుపు తిరిగింది. ఈ ఘటన తర్వాత నాగం కొంతకాలం స్థబ్ధుగా ఉండిపోయారు. ఆ తర్వాత సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పి నగరాను స్థాపించారు.
పార్టీ నుంచి బహిష్కరణ :
తెలుగుదేశం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం, పార్టీ అధ్యక్షుడినే విమర్శించడం ద్వారా పార్టీ నుంచి 2011లో బహిష్కరణకు గురయ్యారు నాగం జనార్థన్ రెడ్డి. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్, అటవీ, వైద్య ఆరోగ్య, పౌర సరఫరా, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిత్వ శాఖలను చేపట్టారు. తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యునిగా కూడా పనిచేశారు. అనంతరం ఆయన రాజకీయ జర్నీ బీజేపీతో కొంతకాలం కొనసాగింది. బీజేపీలోనూ ఇమడలేకపోయిన నాగం జనార్థన్ రెడ్డి... బీజేపీ జాతీయ పెద్దలను, అమిత్ షాను కూడా కలిసి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఆయనను పట్టించుకున్న వారు లేకపోయారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నాగం బీజేపీకి కూడా రాజీనామా చేశారు.
కాగా, బీజేపీకి గుడ్ బై చెప్పక ముందే నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో అప్పటికి పాలమూరులో ఉన్న కాంగ్రెస్ నేతలు నాగం జనార్థన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా అప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నాయకురాలైన డీకే అరుణ వర్గం నాగం రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. జైపాల్ రెడ్డి నాగం కాంగ్రెస్ లోకి వస్తే ఏ మేరకు లాభం ఉంటుందో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరించడంతో నాగం చేరికకు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాగం జనార్థన్ రెడ్డి పార్టీలోకి వస్తే తాము పార్టీ వీడిపోతామని డీకే వర్గం బహిరంగంగానే ప్రకటించింది కూడా. అయినా అధిష్టానం నాగం చేరికకే వత్తాసు పలికింది.
బెల్లం ముక్కకు ఈగలెక్కువ అన్నట్లు...
కాని కాంగ్రెస్ లో చేరినా ఆయనకు మాత్రం ఎటువంటి ప్రాముఖ్యత లభించలేదు. అక్కడ ఒక్క సీటు ఉంటే వందలాది మంది పోటీ పడతారు. బెల్లం ముక్కకు ఈగలెక్కవా అన్న చందంగా ఆ పార్టీ పరిస్థితి ఉంటుంది. అందులోనూ రెండు పార్టీలు మారి వచ్చిన నాగంకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఆ పార్టీలో ఉన్నా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోనూ లేదు. రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుందో లేదో తెలియని పరిస్థితి. పోని ఇంకా ఏమైనా పార్టీలున్నాయా మారడానికి అంటే ఇప్పుడైతే ఆయనకు అన్ని దారులుమూసుకుపోయాయి. కేవలం టీఆర్ ఎస్ పార్టీ ఒక్కటే ఉన్నా అందులో ఆయనకు వెళ్లడం ఇష్టం లేదు. దీంతో నాగం జరిగేది జరుగుతుందన్నట్లు మౌనంగా ఉండిపోయారు. ఒకప్పుడు నాగం అంటే హడల్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి తలక్రిందులైందనే చెప్పాలి. అభిమానులు, అనుచరులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. మరి నాగం మళ్లీ బయటకు వస్తాడా...లేక రాజకకీయ భవిష్యత్తుకు అలాగే ముగింపు పలుకుతాడా..? అన్నది తెలియాల్సి ఉంది.