తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నది. తెలుదేశం పార్టీకి చరిష్మా కలిగిన నేతలు కనిపించడం లేదు. పార్టీ ఓడిపోగానే నేతలు ముఖం చాటేస్తున్నారు. వేరేవేరే పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. 2014లో తెలంగాణాలో టిడిపి పరిస్థితి ఎలా మారిందో 2019 లో ఏపీ లో టిడిపి పరిస్థితి అలా మారబోతున్నది. ఈ మార్పు నుంచి బయటపడాలి అంటే.. కష్టమైనా సరే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి.
ఇప్పుడున్న సమయంలో లోకేష్ కు బాధ్యతలు అప్పగించినా పెద్దగా ఉపయోగం లేదు. బాబులాంటి చరిష్మా కలిగిన నేత కాదు. పైగా ఎక్కడ ఎలా మాట్లాడాలో లోకేష్ ఇంకా నేర్చుకోలేదు. ఫలితంగా విమర్శల పాలవుతున్నారు. పార్టీలో కీలక బాధ్యతలు తీసుకోవడానికి బాలకృష్ణ ముందుకు రావడం లేదు. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటున్నారు తప్పించి బాధ్యతలు తీసుకోవడానికి అడుగు ముందుకు వేయడం లేదు.
ఇది పార్టీని ఇరకాటంలో పెడుతున్నది. స్ట్రాంగ్ లీడర్స్ సైతం ప్రజల్లో కనిపించడం లేదు. అవకాశం దొరికితే పార్టీ మారే ఆలోచనలోనే ఉన్నారు. ఇప్పటికే కొంతమంది పార్టీలు మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది నేతలు ధైర్యం చేసి బాబుతో కొన్ని విషయాల గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చరిష్మా కలిగిన నేత కావాలని, 2009 ఎన్నికల సమయంలో పార్టీ ప్రచారానికి వినియోగించిన ఎన్టీఆర్ ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని పట్టుబడుతున్నారట.
అయితే, జూనియర్ రాకను మాత్రం కుటుంబ సభ్యులుగా ఉన్న కొందరు ఒప్పుకోవడం లేదు. ఆ విషయాన్నీ ఆ నేతలే కొన్ని రోజుల క్రితం బహిరంగంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచే ఎన్టీఆర్ ను రెడీ చేస్తే.. వచ్చే ఎన్నికల నాటికి చాల వరకు ఉపయోగపడతారు. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ అని అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో ఎన్టీఆర్ నుంచి పార్టీని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. అయితే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతుండటంతో ఎలా జరుగుతుందో చూడాలి.