హుజూర్నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఎన్నికల బరిలో అమీతుమి తేల్చుకునేందుకు అస్ర్తశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూర్నగర్లో ఈసారి గులాబీ జెండా ఎగురవేయాలని అధికార టీఆర్ ఎస్ పార్టీ ఉవ్విల్లూరుతోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే తమ పార్టీ అభ్యర్థిగా సైదిరెడ్డిని ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతోంది.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి హుజూర్నగర్ ఉప ఎన్నిక అగ్నిపరీక్షగా మారింది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకొని, రాజకీయ ప్రత్యర్థులకు దీటైన సమాధానం చెప్పాలని ఆయన భా విస్తున్నారు. ఈ క్రమంలోనే తన భార్య పద్మావతిరెడ్డికి టికెట్ ఇప్పించుకుని, గెలిపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలోనే ఆయన ఇతర పార్టీల మద్ధతును కూటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క సొంత పార్టీలోని అసమ్మతి నేతలను కూడా బుజ్జగిస్తూ, తన దారికి తెచ్చుకుంటున్నారు.
ప్రధాన పార్టీలన్నీ పోటీకి దిగినప్పటికీ.. హుజూర్నగర్లో ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ ఎస్కు మధ్యే పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈనేపథ్యంలోనే పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా టీఆర్ ఎస్ను టార్గెట్ చేస్తూ, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్ను ప్ర యోగిస్తున్నాడు. కేసీఆర్ ఉపయోగించే తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్ అస్త్రాన్ని ఈసారి ఉత్తమ్ ప్రయోగిస్తున్నారు.
ఈక్రమంలోనే సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్ నాయకులకు దిక్కులేక ఆంధ్రా వ్యక్తి సైదిరెడ్డి ని హుజూర్నగర్లో పోటీకి నిలబెట్టారని ఆరోపించారు. నియోజకవర్గంతో సంబంధంలేని వ్యక్తిని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.. అయితే ఉత్తమ్కుమార్రెడ్డి, సైదిరెడ్డి పై చేసిన వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ నేతలు ఎటువంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.