కొత్తవాహన చట్టం ప్రకారం జరిమానాలు మోత మోగుతున్నది. మోటారు వాహనాలకే కాదు గాల్లో ఎగిరే విమానాలకు జరిమానాలు విధిస్తున్నారు. అదెలా సాధ్యం అని నోరెళ్లబెట్టకండి. ఇది పోలీసులు విధించే జరిమానా కాదు.. కోర్టు విధించిన జరిమానా. చిన్న పొరపాటు చేసినందుకు పెద్ద జరిమానా పడింది. ముందు పదివేల రూపాయల జరిమానా పడింది. అది కట్టి సైలెంట్ గా ఉంటె పోయేది. కానీ, అలా చేయకుండా.. తమ తప్పు లేదని, ఏదో చిన్న పొరపాటు జరిగిందని చెప్పి పై కోర్టుకు వెళ్లడంతో సదరు విమాన సంస్థకు రూ. 40వేలు ఫైన్ వేసింది దాంతో పాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ. 7 వేలు కూడా కట్టాలని తీర్పు చెప్పింది కోర్టు.
ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. అసలు ఆ న్యూస్ ఏంటి దాని కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2016, జులై 17 వ తేదీన పంజాబ్ లోని మోహాలికి చెందిన చంద్రకాంత్ పాఠక్ తన భార్యతో కలిసి అమెరికా వెళ్ళాడు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో టికెట్ బుక్ చేసుకున్నారు. రిటన్ టికెట్ కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోనే బుక్ చేసుకున్నారు. టికెట్ బుక్ చేసుకునే సమయంలో వెజ్ మీల్ ఇవ్వాలని స్పష్టంగా తెలిపారు. జులై 17 వ తేదీన ప్రయాణం చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
అయితే, అక్కడి నుంచి వచ్చే సమయంలో అంటే నవంబర్ 14, 2016 వ తేదీన రిటర్న్ అయ్యే సమయంలో పాఠక్ ఫ్యామిలీకి వెజ్ మీల్స్ కు బదులుగా నాన్ వెజ్ ఇచ్చారు. దీంతో పాఠక్ ఎయిర్ హోస్టెస్ పై మండిపడ్డాడు. అయితే, పొరపాటు జరిగిందని చెప్పి మీల్స్ మార్చేశారు. కానీ పాఠక్ దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మొహాలీ వెళ్లిన తరువాత డిస్ట్రిక్ట్ ఫోరమ్ లో కంప్లైంట్ చేశారు. పొరపాటు జరిగిందని, ప్యాక్ పై లేబుల్ లేకపోవడంతో అలా జరిగిందని ఎయిర్ ఇండియా పేర్కొన్నది.
కానీ, డిస్ట్రిక్ట్ ఫోరమ్ తప్పు జరిగింది కాబట్టి జరిమానాగా రూ. 10వేలు, కోర్టు ఫీజు కింద రూ.7వేలు కట్టాలని ఫోరమ్ తీర్పు ఇచ్చింది. ఫోరమ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ... పంజాబ్ స్టేట్ ఫోరమ్ కు వెళ్ళింది ఎయిర్ ఇండియా. అక్కడ కూడా ఎయిర్ ఇండియాకు షాక్ తగిలింది. కస్టమర్ల మనోభావాలు దెబ్బతిన్నాయని..జరిమానా కట్టాలని చెప్పి జరిమానాను పదివేల రూపాయల నుంచి రూ. 47 వేల రూపాయలకు పెంచింది. దీంతో పాటు రూ. 7వేల రూపాయలు కోర్టు ఫీజుల కింద చెల్లించాలని పేర్కొన్నది. దీంతో ఎయిర్ ఇండియా షాక్ తిన్నది. డిస్ట్రిక్ట్ ఫోరమ్ ఇచ్చిన తీర్పును అనుసరిస్తే పదివేలతో పోయేదని.. స్టేట్ ఫోరమ్ కు రావడంతో మరింత ఫైన్ పడిందని వాపోయింది.