కొద్దికాలం క్రితం విడుదలైన ఎఫ్2 సినిమా ఎంతగా అలరించిందో గుర్తుండే ఉంటుంది. ప్రధాన పాత్రలో నటించిన వెంకటేశ్ ఆయన పనిచేస్తున్న ఎమ్మెల్యే కంటే ఎక్కువ. సరిగ్గా అలాంటిదే ఓ ఆశ్చర్యకరమైన సంచలనం వెలుగులోకి వచ్చింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తర్ప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు ఆమె కార్యదర్శిగా పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేత్రామ్కు చెందిన రూ.230 కోట్ల విలువైన ‘బినామీ’ ఆస్తులను ఆదాయం పన్ను (ఐటీ) విభాగం జప్తు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీతోపాటు నోయిడా, కోల్కతా, ముంబై నగరాల పరిధిలో గల 19 స్థిరాస్తులను ఐటీ విభాగం జప్తు చేసిందని ఆ వర్గాల కథనం.
నేత్రామ్ నివాసం, కార్యాలయాలపై ఈ ఏడాది మార్చిలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రూ.300 కోట్ల విలువైన బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనంచేసుకున్నారు. జప్తుచేసిన వాటిలో వాణిజ్య, నివాస సముదాయాలు, రూ.1.64 కోట్ల నగదు, రూ.50 లక్షల విలువైన ‘మాంట్ బ్లాంక్' కలాలు, నాలుగు విలాసవంతమైన ఎస్యూవీ కార్లు ఉన్నాయి.
ఇదిలాఉండగా, మాయావతి కేంద్రంగా గత కొద్దికాలంగా ఆదాయానికి మించిన ఆరోపణలు వస్తున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి సోదరుడు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆనంద్కుమార్కు చెందిన రూ.400 కోట్ల విలువైన బినామీ ప్లాట్ను ఆదాయం పన్ను శాఖ (ఐటీ) అధికారులు గత ఏడాది జప్తు చేశారు. ఉత్తర్ప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ్నగర్ జిల్లా పరిధిలోని నోయిడాలో ఉన్న ఈ ఏడు ఎకరాల బినామీ ప్లాట్లో ఐదు నక్షత్రాల హోటల్ను నిర్మించాలని ఆనంద్ కుమార్ భావిస్తున్నారు. ఈ ప్లాట్ ఆనంద్కుమార్, ఆయన భార్య లతదని ఐటీ అధికారులు గుర్తించారు. అయితే వీళ్లు ఈ ప్లాట్ను మరొకరి పేరున (బినామీ) రిజిస్టర్ చేయించారు. ఢిల్లీకి చెందిన హవాలా ఆపరేటర్ల ద్వారా భారీగా డబ్బులు మార్పిడి చేసి ఈ ప్లాట్ను కొనుగోలు చేసినట్లు ఐటీ శాఖ ఆరోపిస్తున్నది. ఈ స్థిరాస్తిని ఐటీ శాఖ జప్తు చేసిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేసే అవకాశముంది. ఆనంద్కుమార్ను బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మాయావతి నియమించిన కొద్దిరోజులకే బినామీ ప్లాట్ ఉదంతం తెరపైకి రావడం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది.