కొత్త వాహన చట్టం చుక్క‌లు చూపిస్తోంది. ఇటీవల ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తూ హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా విధిస్తే...మరో వ్యక్తి లుంగీతో లారీ నడిపాడని భారీ జరిమానా వేశారు. తాజాగా రాజస్థాన్‌ లో ట్రాఫిక్ పోలీసులు రాసిన చలానా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను చర్చకు కారణమైంది. చెప్పులు ధరించి, చొక్కాకు గుండీలు పెట్టుకోలేదని ఓ ట్యాక్సీ డ్రైవర్‌ కు చలానా రాశారు. దీంతో ట్యాక్సీ డ్రైవర్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటని ప్రశ్నస్తే.. కోర్టుకెళ్లాలని ఉచిత సలహా పడేశారు ట్రాఫిక్‌ పోలీసులు. ఈ నెల 6న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ ఇప్పటి వరకు కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురాకపోవడం విశేషం.


భువనేశ్వర్లో కొత్త మోటారు వాహన చట్టం కింద ఓ ఆటోవాలాకు రూ. 25000ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. తాజాగా..ఒడిశాకు చెందిన మరో ఆటో వాలాను ఈ కొత్త చట్టం షేక్ చేసింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించని కారణంగా హరిబంధు అనే ఆటోవాలాకు పోలీసులు రూ. 47,500 జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనం నడిపినందుకు రూ.10000, ధ్వని కాలుష్యానికి కారణమైనందుకు రూ. 10000, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లు లేనందుకు మరో రూ.5000, పర్మిట్ లేనందుకు మరో రూ. 10000, ఇతర ఉల్లంఘనల కింద రూ. 12,500 జరిమానా విధించటంతో మొత్తం జరిమానా రూ.47,500కు చేరింది. తన సెకెండ్ హ్యాండ్ ఆటో ఖరీదే రూ.25,000లకు మించదు అంటూ అతడు లబోదిబోమన్నాడు.


ఇదే భువ‌నేశ్వ‌ర్లో...ఒక వ్యక్తి కొత్త హోండా యాక్టివాను షోరూం నుంచి తీసుకుని వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ స్కూటర్‌పై రిజిస్ట్రేషన్ నంబరు లేకపోవడంతో లక్ష రూపాయల జరిమానా విధించారు. దీంతో పోలీసుల తీరుపై ఆ వాహనదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.



ఇలా కొత్త చ‌ట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న వేలాది రూపాయల జరిమానాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటే.. అన్నీ ఉన్నా ఏదో సాకుతో చలానాలు రాస్తుండడం వాహనదారుల్లో గుబులు పుట్టిస్తోంది. అర్థంపర్థం లేకుండా విధిస్తున్న జరిమానాలతో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: