రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరు చెప్పలేం. మొన్నటివరకు పొగిడిన నేతలే....నేడు విమర్శలు చేయడం రాజకీయాల్లో అలవాటైపోయింది. అలాంటి నేతలకు బీజేపీ ఎంపీ సుజనా చౌదరీ ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. మొన్నటివరకు సుజనా టీడీపీలో ఎలాంటి పాత్ర పోషించారో అందరికీ తెలుసు. చంద్రబాబు శిష్యుడుగా ఉంటూ...పార్టీలో పెద్దగా వ్యవహరించారు. టికెట్లు కేటాయింపు దగ్గర నుంచి ప్రతి విషయాన్ని సుజనానే దగ్గర ఉండి చూసుకున్నారు.
అలా చంద్రబాబు శిష్యుడుగా మెలిగిన సుజనా...ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరిపోయిన విషయం తెలిసిందే. అయితే బీజేపీలో చేరిన ప్రారంభంలో సుజనా చంద్రబాబు గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ నిదానంగా బాబుపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల బాబు జమిలీ ఎన్నికలు రావోచ్చని మాట్లాడటంపై సుజనా కౌంటర్ ఇచ్చారు. జమిలీ ఎన్నికలపై మాట్లాడే స్థాయిలో చంద్రబాబు లేరని, ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని మాట్లాడారు.
ఇక తాజాగా చంద్రబాబు నివాసంపై పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ని కూల్చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై సుజనా స్పదించారు. చంద్రబాబు ఇంకా ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నారో తనకు అర్థంకావడం లేదని, తానైతే అలాంటి ఇంట్లో ఉండనని స్పష్టం చేశారు.
అద్దె ఇంట్లో సమస్య వస్తే అక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిదని, ఈ అంశంలో సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుని ముందుకు సాగితే బాగుంటుందని ఆయన అన్నారు. ఏది ఏమైనా ఈ మధ్య చంద్రబాబు మీద శిష్యుడు రివర్స్ అవుతున్నట్లే కనిపిస్తోంది. అయితే అదే టైంలో కొందరు మాత్రం సుజనా - బాబు మధ్య ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయని.. బాబు డైరెక్షన్లోనే సుజనా పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.