కృష్ణానది కరకట్టపై తాను నిర్మించుకున్న ఇంటికి అనుమతులు ఉన్నాయని, నిబంధలన మేరకే ఇంటిని నిర్మించానని, అందుకు నా వద్ద ఆధారాలు ఉన్నాయని లింగమనేని రమేష్ సర్కారుకు లేఖ రాస్తే.. కాదు కాదు.. అసలు ఆ ఇంటిని అక్రమంగా నిర్మించారని లింగమనేని రమేష్ అబద్దాలు చెపుతున్నాడని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఐదేండ్లుగా లింగమనేని రమేష్ కృష్ణానది కరకట్టపై నిర్మించిన ఇంటిని తన అధికారం నివాసంగా చేసుకుని పరిపాలన చేశాడు.
అధికారం చేతులు మారింది. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా అయ్యారు. అయితే కృష్ణానది కరకట్టపై పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ నిర్మించుకున్న ఇల్లు నిబంధనల మేరకు నిర్మించలేదని, కృష్ణానది కరకట్టపై నిబంధలను ఉల్లంఘించారని ఇంటిని కూల్చివేయాలని నోటీసులు ఇచ్చింది సీఆర్డీఏ. అయితే ఈ నోటీసులకు లింగమనేని రమేష్ సమాధానంగా ఏపీ సీఎం జగన్కు ఐదు పేజీల లేఖ రాసాడట.
లేఖలో లింగమనేని రమేష్ ఉండవల్లిలోని అతిథిగృహానికి 2012లోనే చట్టపరమైన అన్ని అనుమతులతో పాటు ఇరిగేషన్ శాఖలోని కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నుంచి ఎన్వోసీ కూడా తీసుకున్నానని స్పష్టం చేశారు. అదే లేఖలో 2014లో సీఎంగా చంద్రబాబుకు అధికార నివాసం లేకపోవడంతో కరకట్ట మీదున్న తన గెస్ట్ హౌస్ను అధికార నివాసానికి ఇచ్చానన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధమైన దురాలోచనలు లేవని స్పష్టం చేశారు లింగమనేని.
అయితే దీనికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి స్పందించారు. లేఖలో పేర్కొన్న విషయాలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. చంద్రబాబు వల్ల లబ్ది పొందకుంటే తన ఇంటిని ఎందుకిచ్చారో చెప్పాలన్నారు. అక్రమంగా భవనాలు కట్టారు కాబట్టే ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. చుక్కల భూముల్లో కూడా వెంచర్లు వేసిన లింగమనేని ఎక్కడెక్కడ ఎన్ని ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టారో లెక్కలతో చెబునన్నారు. అయితే లింగమనేని ఇచ్చిన సమాధానంతో జగన్ ప్రభుత్వం చంద్రబాబు అద్దెకు ఉంటున్న అద్దెకొంపను కూల్చుతారా.. లేక మరికొంత కాలం వేచిచూస్తారా... వేచిచూడాల్సిందే.