వాన రాక.. ప్రాణం పోకడను ఎవరూ చెప్పలేరు. వానలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఉన్నట్టుండి మబ్బులు పడతాయి. వర్షం కురుస్తుందేమో అనుకుంటారు. కానీ, వర్షం పడదు. ఎండ కాస్తుందిలే అని చెప్పి బయటకు వెళ్లారు.. అంటే ఓ అరగంట పాటు ఆగకుండా వర్షం కురుస్తుంది. పది నిమిషాల్లో ఇల్లు చేరుకోవాల్సిన ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్ లో నిలబడిపోతారు. ఎంత ప్రయత్నించినా ట్రాఫిక్ నుంచి బయటపడలేరు.
పదినిమిషాల వర్షం కురిస్తేనే హైదరాబాద్ నగరంలోని రోడ్లు దారుణంగా మారిపోతున్నాయి. అసలు రోడ్డు కనిపించదు. ఎక్కడ మ్యాన్ హొల్స్ ఉన్నాయో.. ఎక్కడ లేవో తెలుసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. పైగా మన రోడ్లు దారుణంగా ఉంటాయి. అంగారక గ్రహంపై ఉన్నట్టుగా గుంతలు కనిపిస్తుంటాయి. ఆ గుంటల్లో నీరు నిండిపోయి ఉండటంతో దాని మీదనుంచి బండ్లు వెళ్తే.. ఇక అంటే.. కిందపడాల్సిందే.
ఎక్కడ చూసినా ఇలానే కనిపిస్తుంది. ఐటి నగరంలో ఇలాంటి దుస్థితి కనిపించడం దారుణం. డ్రైనేజ్ వ్యవస్థ సవ్యంగా లేకపోవడం కారణంగానే ఇలా జరుగున్నది. నిన్నటి రోజున సాక్షాత్తు ఐటి మంత్రి కేటీఆర్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు అంటే అర్ధం చేసుకోవచ్చు. మన రోడ్ల ఎలా ఉన్నాయో. ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉండిపోయింది. వర్షం కురుస్తుంది కదా అని మెట్రో ఎక్కితే.. అవి సైతం మొరాయిస్తున్నాయి. మెట్రో కింద నిలబడాలంటే భయం.. ఎక్కడ అవి విరిగి నెత్తినపడతాయో అని.. మెట్రో ఎక్కితే మరో భయం.. ఎక్కడ మొరాయిస్తాయో అని..
ఇన్ని భయాల మధ్య ప్రజలు గమ్యస్థానాలకు చేరుకోవాలి అంటే ఎంత సమయం పడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇన్ని భయాల మధ్య ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ఇంటికి చేరుకున్నాక హమ్మయ్య సేఫ్ గా చేరుకున్నాం అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ దుస్థితి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ఎలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో హైదరాబాద్ నగరపాలక సంస్థ ముందునుంచే ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేస్తే బాగుంటుంది. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇలానే జరుగుతున్నది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటే మంచిది.