ఆర్టికల్ 370 రద్దు తరువాత అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ గతంలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులను అంచనా వేశారు. సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న
దక్షిణ కాశ్మీర్లోని సోఫియాన్ లో అయన పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలతో సమావేశం అయ్యారు. అనేక విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.
సోఫియాన్ ప్రజలతో పాటు కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో అయన తిరిగారు. అనంతనాగ్ లో సైతం పర్యటించారు. ఇక ప్రజలు,
ప్రభుత్వం, ఆర్మీ అధికారులతో విడివిడిగా సమావేశమైన అజిత్ దోవల్ దాదాపు 11 రోజులపాటు అక్కడే ఉన్నారు. పరిస్థితులు అన్ని సక్రమంగా ఉన్నాయని తెలుసుకున్నాక తిరిగి
ఢిల్లీ వచ్చారు. అక్కడి నుంచి
రష్యా,
ఫ్రాన్స్ వెళ్లారు. కాగా, ఐరాస వేదికగా జరుగుతున్న సర్వసభ సమావేశాల్లో మోడీతో పాటు దోవల్ కూడా వెళ్లాల్సి ఉన్నా.. జమ్మూ కాశ్మీర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రణాళికలు, అభివృద్ధి గురించి అక్కడి ప్రజలతోను అధికారులతోను మాట్లాడేందుకు అయన ఇండియాలోనే ఉండిపోయారు.
దోవల్ బుధవారం రోజున జమ్మూ కాశ్మీర్ వెళ్లారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయన పర్యటించబోతున్నారు. అక్టోబర్ 31 నుంచి జమ్మూ కాశ్మీర్, లడక్ లు అధికారికంగా కేంద్రపాలిత రాష్ట్రాలుగా మారబోతున్నాయి. ఆ సమయం వరకు అక్కడి పరిస్థితులు నార్మల్ గా తీసుకొచ్చేందుకు దోవల్ పర్యటిస్తున్నారు. దోవల్ రాకతో మరలా అక్కడ సందడి వాతావరణం నెలకొంది. బోర్డర్ లో సైన్యం అప్రమత్తం అయ్యింది. జైషే సంస్థ హిట్ లిస్ట్ లో మోడీ, షా లతో పాటు దోవల్ కూడా ఉన్నారు.
అందమైన కాశ్మీర్ మాత్రమే కాదు.. అందరికి ఆమోదయోగ్యమైన.. అందరికి ఉపాధి కల్పించే కాశ్మీర్ రూపకల్పన చేయబోతున్నట్టు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ అధికారులకు సంకేతాలు వెళ్లాయి. అంతేకాదు, ఏడేళ్లపాటు జమ్మూ కాశ్మీర్ కు టాక్స్ ఫ్రీ జోన్ గా ప్రకటించారు. 50వేల ఉద్యోగాలు కల్పించేందుకు
ప్రభుత్వం సిద్ధం అయ్యింది. దీంతో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టబోతున్నట్టు కేంద్ర
ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31 తరువాత దేశంలో కొత్త కాశ్మీర్ ను చూడబోతున్నామన్నమాట.