తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కుచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ నెల 17న జరిగిన ఈ ప్రమాదంలో ఎంతో మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు. అయితే ప్రమాదానికి గురైన బోటులో 77 మంది ప్రయాణించగా 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన వారంతా వరదలో కొట్టుకుపోయి మృతి చెందారు. కాగా ఇప్పటికే అధికారులు కొన్ని మృతదేహాలను వెలికి తీయగా... గల్లంతైన మరికొన్ని మృతదేహాల కోసం అధికారులు ఇంకా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో గోదావరి నది లో మరో బోటు ప్రమాదానికి గురైంది. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే గల్లంతయిన వారి మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో దేవీపట్నం మండలం మంటారు వద్ద మృతదేహాల కోసం గాలింపు చేపడుతుండగా గోదావరి ప్రవాహం ఉదృతంగా ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. అయితే అందరూ క్షేమంగా బయట పడగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
దీంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా మొన్న జరిగిన బోట్ ప్రమాదంలో ఇంకొన్ని మృతదేహాలను వెలికి తీయాల్సిన ఉండగా... ఆ మృతదేహాలు బోట్లో ఇరుక్కుపోయి ఉంటాయని... లేదా గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోయి లంక గ్రామాలు ఒడ్డుకు తేలే అవకాశం ఉందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంచనావేస్తున్నారు. కాగా గల్లంతైన మృతదేహాలను వెలికి తీసేందుకు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రోజు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. అయితే ఈ బోటు ప్రమాదంలో మరణించిన వారందరికీ 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం.