బాబుగారు వైసీపీ మీద ఓ రేంజ్ లో విమర్శలు కురిస్తున్నారు. వైసీపీ నేతల అరాచకాలు నిత్యకృత్యాలయ్యాయని.. అందుకే నిదర్శనమే.. మొన్న ఒక విలేఖరి పై ఆమంచి వర్గం దాడి అని, అలాగే నిన్న గ్రామ వాలంటీర్ వేధింపులు భరించలేక ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుందని.. ఈ రోజు వైసీపీ నేతల వేధింపులు భరించలేక ఒక దళిత మహిళ, ఆశా కార్యకర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది అని బాబుగారు ఆవేదన చెందుతూ.. జగన్ గారూ ఏమిటీ రాక్షస పాలన ? మీరు తెస్తానన్న రాజన్న రాజ్యం ఇదేనా ? మీ వైసీపీ నేతల దాష్టీకాలకు రోజుకోకరిని బలి తీసుకోవడమే రాజన్న రాజ్యమా ? అని బాబుగారు ప్రశ్నలు సంధిస్తున్నారు. పైగా వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరలు మండుతున్నాయని కూడా అంటున్నారు. మరి బాబుగారి పాలనలో నిత్యావసరాల ధరలు బాగా కూల్ గా ఉన్నాయి కదా. అన్నట్లు బాబుగారు మరో డైలాగ్ పలికారు. వైసీపీ అధికారంలోకి రాగానే పడగ విప్పిన బ్లాక్ మార్కెటింగ్ ధరల నియంత్రణలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందట. అదే బాబుగారు ప్రభుత్వం అయితే.. ఇలాంటివి అన్ని బాబుగారి చెప్పినట్లే ఉంటాయోమో మరి.. ప్చ్. బాబుగారు ఈ రోజు గుంటూరు తెదేపా కార్యాలయంలో ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరికొన్ని విమర్శలు చేశారు. అయినా విమర్శలు చేయింది ఎప్పడు ? బాబుగారి మాటల్లో.. వైకాపా నేతలు కొత్తగా చేసేది ఏదీ లేదని, గత తెదేపా ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు, కొబ్బరికాయ కొట్టడం, ఇదివరకే జరిగిన శంకుస్థాపనలు మళ్ళీ చేస్తున్నారని బాబుగారు చెప్పుకొచ్చారు.
''అధికారంలోకి వచ్చాక 1,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేశాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు, నిజానికి అవన్నీ వైకాపా కార్యకర్తల కోసం సృష్టించారు తప్ప నిజమైన నిరుద్యోగుల కోసం కాదు అని'' ఇదీ ఏపీలో ప్రతి నిరుద్యోగి వెలిబుచ్చుతున్న అభిప్రాయం అన్నట్లు బాబుగారు పంచ్ డైలాగ్ కూడా చెప్పారు. పైగా దాదాపు ఉద్యోగాలన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారట. పనిలో పనిగా సెంటిమెంట్ ని పండించడానికి అన్నట్లు నా మీద కక్ష సాధించాలని రైతులను క్షోభపెట్టే మరో ఘోర తప్పిదం జగన్ ప్రభుత్వం చేసిందని.. రైతురుణమాఫీ సొమ్ముకి సంబంధించిన జీవో-38ని రద్దు చేయడం అమానుషం అని, మీ చేతకానితనం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని ఈ పరిస్థితుల్లో ఇలా చేయడం దుర్మార్గం అని బాబుగారు మిక్కిలి చింతిస్తున్నారు పాపం.