అది ఒకప్పుడు వందల మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమ.. కానీ కాలక్రమంలో నష్టాల బాట పట్టింది. సరిగ్గా పట్టించుకునే నాయకుడు లేక.. చివరకు మూతబడింది. తెలంగాణకే గర్వకారణంగా ఉండే ఆ పరిశ్రమను తెలిపించడానికి ఇప్పుడు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అదే రామగుండం ఫర్టిలైజర్స్‌.


తాజాగా. ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్యే చందర్‌, రామగుండం ఫర్టిలైజర్స్‌ కంపెనీ ప్రతినిధి బృందం సభ్యులు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నది. కంపెనీ కార్యకలాపాల ప్రారంభం కోసం అవసరమైన అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కంపెనీ పునరుద్ధర కృషి చేశాం. అందుకే కంపెనీ పునరుద్ధరణలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష భాగస్వామ్యం తీసుకున్నది.


మూతబడిన బిల్ట్‌ లాంటి కంపెనీలను తిరిగి ప్రారంభించేందుకు పరిశ్రమల శాఖ తరపున ప్రయత్నాలు చేస్తున్నాం. ఫ్యాక్టరీకి అవసరమైన ఉద్యోగాల కల్పనలో స్థానికులకు సాధ్యమైనంత మేర అవకాశాలు ఇవ్వాలి. కంపెనీ అవసరాల మేరకు తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ ద్వారా యువకులకు ప్రభుత్వ ఖర్చుతో శిక్షణ ఇస్తాం. అందులో నుంచి ఉద్యోగులను ఎంపిక చేసుకోవాలి. స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ సిబ్బంది కోసం టాస్క్‌ ద్వారా ప్రత్యేక కోర్సులు తయారు చేసి శిక్షణ ఇచ్చేందుకు సైతం సిద్ధంగా ఉన్నాం.


అన్‌స్కిల్డ్‌ కార్మికులను జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛేంజీ ద్వారా భర్తీ చేసుకునే అవకాశాలను పరిశీలించాలి. ఇక్కడ ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని పునఃప్రారంభించేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రికి లేఖ రాస్తాం. కంపెనీకి అవసరమైన రవాణా, హమాలీ వంటి అంశాల్లోనూ.. ఈ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఉపయోగించుకోవాలి అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కేటీఆర్ కృషి ఫలించి.. ఈ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభమైతే.. తెలంగాణ రైతాంగానికి కూడా చాలా మేలు జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: