"భారత్లో వృద్ధి వేగం నెమ్మదిగా ఉండడానికి చాలా కారణాలు ఉండచ్చు. వాటిలో ప్రపంచంలోని అన్ని ఆర్థికవ్యవస్థల్లో వచ్చిన మందగమనం ఒక పెద్ద కారణం" అని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు.
భారత్ లో ఆర్ధిక మాంద్యం గతంలో ఎప్పుడొచ్చింది?
భారత ఆర్థికవ్యవస్థలో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం 1991లో వచ్చింది. అప్పుడు దిగుమతులకోసం దేశ విదేశీ మారకనిల్వలు తగ్గిపోయి 28 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇప్పుడు ఆ మొత్తం 491 బిలియన్ డాలర్లు. 2008 - 09లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం వచ్చింది. ఆ సమయంలో భారత ఆర్థికవ్యవస్థ 3.1 శాతం వృద్ధి రేటుతో ముందుకు నడిచింది. "అది అంతకు ముందు ఏళ్లతో పోలిస్తే తక్కువే. కానీ భారత్ ఆ సమయంలో కూడా మాంద్యానికి గురికాలేదని" ప్రముఖ ఎకనమిస్ట్ వివేక్ కాల్ చెబుతారు.
అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తీవ్రస్థాయిలో ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిన్ లగార్డే గత ఏప్రిల్ లో - ఐఎంఎఫ్ వార్షిక సమావేశం జరుగటానికి ముందుగానే జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె హెచ్చరించారు. గత జనవరి నుండే ఆర్థిక ప్రగతి మందగమనంలో పడిందని, ఇది మరింత క్షీణించే అవకాశం వుందని చెప్పారు.
రెండేళ్ల గతంలో 75 శాతం పైగా అభివృద్ధి నమోదు చేసుకున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 70 శాతం మేర ఈ ఏడాది ఆర్ధిక మందగమనానికి గురయ్యే అవకాశం వుందని తాము అంచనా వేస్తున్నామన్నారు. అయితే ఇప్పటి ఆర్ధిక క్లిష్ట పరిస్థితుల అనంతరం సమీప భవిష్యత్తులో మరో మాంద్యం వంటి ప్రమాద పరిస్థితులను తాము ఊహించటం లేదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పయనిస్తోందని నాడే ఆమె అన్నారు.
పరిస్థితి ఏ మాత్రం తలకిందులైనా వృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. ఆర్థిక పరిస్థితులు అంచనా వేసిన దానికన్నా క్లిష్టంగా వుంటాయని, ఇది అనేక దేశాల ప్రభుత్వాలు, కంపెనీలకు ఋణాల రీ ఫైనాన్సింగ్, మార్పిడి రేట్ల పెరుగుదల, మార్కెట్ ఆర్ధిక పరిస్థితుల దిద్దుబాటు వంటి పెను సవాళ్లను విసిరే అవకాశం వుందని ఆమె చెప్పారు.
గత దశాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా కొనసాగిన తక్కువ వడ్డీ రేట్ల విధానాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, ఫలితంగానే ప్రస్తుతం మందగమనం కొనసాగుతోందని ఆమె వివరించారు. వాస్తవానికి ప్రపంచంలో అధికశాతం దేశాల ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేవని, ప్రభుత్వాలపై పెరుగుతున్న ఋణభారం, తక్కువ వడ్డీ రేట్ల వంటి అంశాలు మంద గమనంపై ప్రతి స్పందించేందుకు వెసులు బాటు కల్పించటం లేదని ఆమె అన్నారు.